
న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అసంతృప్తిని వ్యక్తం చేసింది. జడ్జిమెంట్ను పూర్తిగా చదివి రివ్యూ పిటిషన్ వేయాలో వద్దో ఆలోచిస్తామని చెప్పింది. ప్రజలంతా శాంతి, స్నేహంతో మెలగాలని సూచించింది. ఏఐఎంపీఎల్బీ సెక్రటరీ జఫర్యాబ్ జిలానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. అంతే గౌరవంతో తీర్పులోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నాం’ అని చెప్పారు. తీర్పులో కొన్ని అంశాలు మాత్రం దేశంలో సెక్యులర్ భావనను పెంపొందిస్తాయన్నారు. ‘లోపలున్న భూమిని మరోపార్టీకి ఇచ్చారు. అది కేవలం వాళ్లదే కాదు’ అన్నారు. దీనిపై చర్చిస్తామని, కావాల్సిన చట్టపరమైన సాయం తీసుకుంటామని చెప్పారు. ‘మథుర, వారణాసిల విషయంలోనూ ఇలాంటి వాదనలే వస్తాయని అనుకుంటున్నారా?’ అని అడిగితే ‘అలాంటిదేం ఉండదు’ అన్నారు.
అప్పుడూ, ఇప్పుడూ అన్యాయమే
కేసు విషయంలో చివరిదాకా పోరాడాల్సిన అవసరముందని బోర్డు లీగల్ టీం మెంబర్, లాయర్ ఎం ఆర్ శంషద్ అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చినట్టే ఇప్పుడూ తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ‘ఈ తీర్పు తర్వాత ఇండియాలోని ఏ మసీదును టచ్ చేయరని భావిస్తున్నాం’ అన్నారు. ‘చారిత్రక సాక్ష్యాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. అందుకే తీర్పుపై బోర్డు నిరాశ చెందింది’ అని సుప్రీం అడ్వొకేట్ షకీల్ అహ్మద్ సయ్యద్ చెప్పారు. ‘విశ్వాసాలను దృష్టిలో పెట్టుకోకుండా చారిత్రక నిజాల ప్రకారం తీర్పిస్తుందని అనుకున్నాం’ అని ఏఐఎంపీఎల్బీ మెంబర్ కమల్ ఫారుఖీ అభిప్రాయపడ్డారు.
తీర్పును చదువుతున్నాం
సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామని, చాలెంజ్ చేసే ఆలోచన లేదని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫారుఖీ చెప్పారు. ‘తీర్పును బోర్డు చదువుతోంది. పూర్తి స్టేట్మెంట్ తర్వాత ఇస్తాం’ అని చెప్పారు. ‘తీర్పు విషయంలో తాము సంతృప్తి చెందలేదు. రివ్యూకు వెళ్తాం’ అని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కౌన్సెల్ జిలానీ ప్రకటించాక ఫారుఖీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫారుఖీ మాటల తర్వాత జిలానీని సంప్రదించగా తాను సున్నీ వక్ఫ్ బోర్డు కౌన్సెల్గా మాట్లాడలేదని, ఏఐఎంపీఎల్బీ సెక్రటరీగా చెప్పానని క్లారిటీ ఇచ్చారు