హనుమకొండ, వెలుగు: వాళ్లిద్దరూ ఫ్రెండ్స్..ఒకరు పది పాస్ అయితే మరొకరు ఫెయిలయ్యారు. అయితేనేం నకిలీ సర్టిఫికెట్లతో ఆయుర్వేద డాక్టర్ల అవతారం ఎత్తి 25 ఏండ్లుగా లక్షల మందికి ట్రీట్మెంట్ ఇస్తూ లక్షలు సంపాదించారు. ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి మంగళవారం తెలియజేశారు. హంటర్ రోడ్డుకు చెందిన ఇమ్మడి కుమార్, వరంగల్ చార్ బౌళి ఏరియాకు చెందిన మహ్మద్ రఫీ ఫ్రెండ్స్. కుమార్ పది పాస్ కాగా.. రఫీ ఫెయిలయ్యాడు. ఇద్దరూ 1997 కంటే ముందు వరంగల్ లోని ప్రముఖ డాక్టర్ల వద్ద కంపౌండర్లుగా పని చేశారు. ఆ నాలెడ్జ్ తో హాస్పిటల్తెరవాలనుకున్నారు.
రూ.5 వేలకే డాక్టర్ డిగ్రీ పట్టా
కుమార్, రఫీ ఇద్దరూ డాక్టర్లు కావాలని ఫిక్సయ్యాక బీహార్లోని దేవ్ఘర్ విద్యాపీఠ్ యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్టు నకిలీ సర్టిఫికెట్లు సంపాదించారు. వీటికి కేవలం రూ. 5 వేలు మాత్రమే ఖర్చు చేశారు. ఇమ్మడి కుమార్.. క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో..రఫీ చార్ బౌళి ప్రాంతంలోనే సలీమా క్లినిక్ను స్టార్ట్ చేశారు. ఇలా 25 ఏండ్ల నుంచి డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ఒక్కొక్కరు రోజుకు 30 నుంచి 40 మంది పేషెంట్లను చూసేవారు. టెస్టుల కోసం ల్యాబ్లు, మందుల కోసం మెడికల్షాపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికి ట్రీట్మెంట్ఇచ్చారు. రోగి వ్యాధి ముదిరితే పెద్ద దవాఖానాలకు రిఫర్ చేసేవారు. ఈ క్రమంలో వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులకు విషయం తెలియడంతో మట్వాడా, ఇంతేజార్గంజ్ పోలీసులు, వరంగల్ రీజినల్ఆయుష్ విభాగానికి చెందిన డాక్టర్లతో కలిసి రెండు క్లినిక్లలో తనిఖీలు చేశారు. వీరివి నకిలీ సర్టిఫికేట్లని తేలగా.. అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిజాన్ని ఒప్పుకున్నారు. రెండు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు, రూ.1.28 లక్షలనగదు, వైద్య పరికరాలు, మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్రెడ్డి, ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ రవినాయక్, టాస్క్ ఫోర్స్ సీఐలు నరేశ్కుమార్, వేంకటేశ్వర్లు, ఎస్సైలు లవన్ కుమార్, శ్రీకాంత్, ఏఏవో సల్మాన్ పాషా లను సీపీ అభినందించారు.