
కరాచీ: ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ లెజెండ్స్తో పోల్చితే చాలా సంతోషిస్తానని పాక్ లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. దీనివల్ల తాను సాధించిన ఘనతలకు తగిన గుర్తింపు వస్తుందన్నాడు. కానీ ప్రతిసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చి తనను తక్కువ చేయొద్దన్నాడు. ‘ఒకవేళ మీరు నన్ను ఎవరితోనైనా పోల్చాలనుకుంటే.. పాక్ ప్లేయర్లతో కంపేర్ చెయ్యండి. మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్లాంటి లెజెండ్స్ మాకూ ఉన్నారు. వీళ్లతో నన్ను పోల్చితే.. నేను మరింత గర్వపడతా. నేను సాధించిన ఘనతలు కూడా ప్రపంచానికి తెలుస్తాయి. కానీ పదేపదే విరాట్తో పోల్చడం వల్ల నేను క్రికెట్లో వెనుకబడిపోతున్నానని అనిపిస్తుంది’ అని ఆజమ్ వ్యాఖ్యానించాడు. పాక్ తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో బాబర్ చాలా నిలకడగా ఆడుతున్నాడు. దీంతో అతన్ని ఎక్కువగా విరాట్తో పోలుస్తుంటారు. అయితే తాను కూడా విరాట్లా ఆడాలని, అతనిలా ఎదగాలని గతంలో చాలాసార్లు వెల్లడించిన బాబర్..ఈసారి మాత్రం మాట మార్చాడు. ప్రస్తుతం టీ20ల్లో బాబర్ టాప్ ర్యాంక్లో ఉండగా, కోహ్లీ వన్డేల్లో నంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. వన్డే, టీ20ల్లో బాబర్ యావరేజ్ 50 కాగా, టెస్ట్ల్లో 45గా ఉంది.