బాబు సన్నిహితులకు…జగన్ ఝలక్

బాబు సన్నిహితులకు…జగన్ ఝలక్

ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజునే జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పాలనలో త‌న‌ మార్కు చూపించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అధికార యంత్రాంగంలో కీలకమార్పులకు శ్రీకారం చుట్టారు. పాలనపై జ‌గ‌న్ త‌న పట్టు బిగించేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. TDP ప్రభుత్వ హ‌యాంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది అధికారులను బ‌దిలీల‌తో లూప్ లైన్ లోకి పంపుతున్నారు సీఎం జగన్.

మాజీ సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో CMOలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నలుగురు అధికారులను బదిలీ చేశారు. ఈ దీనికి సంబంధించి సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. CMO ప్రత్యేక కార్యదర్శి సతీశ్‌ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, సీఎం సెక్ర‌ట‌రీలుగా ఉన్నా గిరిజాశంకర్‌, అడుసుమిల్లి రాజమౌళిని బదిలీ చేశారు. వీరందరినీ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. CMOలో తొలి పోస్టింగ్ ఆర్డ‌ర్ గా టూరిజం శాఖ ఎండీ ధనుంజయ్‌ రెడ్డిని సీఎం అదనపు కార్యదర్శిగా నియమించారు. దీంతో చంద్ర‌బాబు హ‌యాంలో అత్యంత స‌న్నిహితులుగా మెలిగిన అధికారుల‌ను ప‌క్క‌న పెట్టారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను నియమించారు. సీఎం కార్యదర్శిగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించారు.

మరోవైపు ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవాంగ్‌ ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు.  ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీలో కమిషనర్‌గా ఉన్న త్రిపాఠిని జీఏడీకి బదిలీ చేశారు. మరోవైపు ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు కూడా స్థానచలనం కలిగింది. ఆయన్ను జీఏడీకి రిపోర్ట్‌ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. వెంకటేశ్వరరావు స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. డీజీపీ ఠాగూర్ జ‌గ‌న్ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం విష‌యంలో ఓవ‌ర్ గా స్పందించి విమ‌ర్శ‌ల‌పాలైయ్యారు.

కొత్త నియామ‌కాల త‌ర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి  IPS,IAS అధికారులతో సమావేశమయ్యారు.