ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్
మూడు రెట్లు పెరిగిన బర్త్ రిజిస్ట్రేషన్లు
పదేళ్లలో ఇండియాలో 80 శాతానికి పెరుగుదల
ప్రపంచంలో రిజిస్టర్ కాని పిల్లలు 16.6 కోట్లు: యునిసెఫ్ రిపోర్ట్
ఒకప్పుడు పిల్లలు పుట్టగానే బర్త్ సర్టిఫికెట్ తీసుకునేటోళ్లు కాదు. కానీ, ఇప్పుడు కాలం మారింది. పుట్టిన 15 రోజుల్లోపే పిల్లల పేరు మీద బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు పిల్లల అమ్మానాన్నలు. ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచంలో ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్లే ఆ ట్రెండ్లో ముందున్నాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ‘బర్త్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీ చైల్డ్ బై 2030: ఆర్ వి ఆన్ ట్రాక్?’ పేరిట ఐక్యరాజ్యసమితి చిల్డ్రెన్స్ ఫండ్ యునిసెఫ్ రిపోర్టును విడుదల చేసింది. 174 దేశాలకు సంబంధించిన డేటాను విశ్లేషించి నివేదికను తయారు చేసింది. అందులో పుట్టే నలుగురు పిల్లల్లో ముగ్గురికి బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటున్నట్టు వెల్లడించింది. పదేళ్లలో బర్త్ రిజిస్ట్రేషన్లు 20 శాతం పెరిగాయని తెలిపింది.
మన దేశంలో 80 శాతం
ప్రపంచం మొత్తంలో బర్త్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్లే ముందున్నాయి. ఇరవై ఏళ్లలో ఈ మూడు దేశాల్లో బర్త్ రిజిస్ట్రేషన్లు మూడు రెట్లు పెరిగాయి. అప్పట్లో 23 శాతం మాత్రమే ఉన్న పిల్లల నమోదు, ఇప్పుడు 70 శాతానికి పెరిగింది. ఈ మూడు దేశాల్లోనూ ఇండియానే టాప్లో ఉండడం విశేషం. 2005–06లో కేవలం 41 శాతం మాత్రమే ఉన్న బర్త్ రిజిస్ట్రేషన్లు, పదేళ్లలో 80 శాతానికి పెరిగాయి. దక్షిణాసియాలో బర్త్ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, అవి పడిపోయే ప్రమాదముందని యునిసెఫ్ రిపోర్ట్ పేర్కొంది. కారణం, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లలో బర్త్ రిజిస్ట్రేషన్లు పడిపోవడమేనని వెల్లడించింది. ఇక, సబ్సహారన్ ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా, జాంబియా, చాడ్ అట్టడుగున నిలిచాయి.
అక్కడ పెద్దోళ్ల ఇండ్లలోనే పెరిగాయి
బర్త్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల పేదలకు చాలా మంచి జరుగుతోందని యునిసెఫ్ రిపోర్టు పేర్కొంది. అయితే, సబ్సహారన్ ఆఫ్రికా దేశాల్లో మాత్రం డబ్బున్నోళ్లే పిల్లల పుట్టుక వివరాలను రిజిస్టర్ చేయిస్తున్నారని, పేదోళ్లు చేయించట్లేదని రిపోర్టు పేర్కొంది. ఇటు మన పొరుగు దేశం పాకిస్థాన్లో 2006–07 నుంచి బర్త్ రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయని, అక్కడా పెద్దోళ్లే తమ పిల్లల పుట్టుకను రిజిస్టర్ చేయిస్తున్నారని వెల్లడించింది. బర్త్ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, దశాబ్ద కాలంలో పావు వంతు మంది పిల్లలు మాత్రం అందుకు నోచుకోవట్లేదని రిపోర్టు పేర్కొంది. దాని వల్ల వాళ్లకు ఎలాంటి బెనిఫిట్లు అందట్లేదని, ప్రభుత్వ ఫలాలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బర్త్ రిజిస్ట్రేషన్ చేయని పిల్లలు 16.6 కోట్ల మంది దాకా ఉన్నారని చెప్పింది.
చదువు, ఆరోగ్యం అందట్లె
బర్త్ రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ప్రభుత్వ లెక్కల్లో ఉండట్లేదని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిటా ఫోర్ చెప్పారు. వాళ్లకు ప్రభుత్వం అందించే కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఐడెంటిటీ లేకపోవడంతో వాళ్లకు అందాల్సిన ఫలాలు అందట్లేదన్నారు. కాబట్టి అన్ని దేశాల ప్రభుత్వాలు అందుకు తగినట్టు సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) పెట్టుకోవాలని సూచించారు. 2030 నాటికి పిల్లలందరికీ బర్త్ రిజిస్ట్రేషన్ సహా సరైన ఐడెంటిటీ కల్పించాలన్నారు. ప్రతి మూడు దేశాల్లో ఒక దేశం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నారు.