
తిరువనంతపురం: కేరళలోని ఓ బేకరీ ఓనర్ కు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. ఇడుక్కి జిల్లాలోని పుట్టాడి వద్ద బేకరీ నడుపుతున్న 39 ఏళ్ల వ్యక్తికి కిందటి గురువారం కరోనా టెస్టులు చేయగా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి తరలించారు. మే 3 తర్వాత లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో దుకాణం తెరవగా.. అప్పటి నుంచి అతని షాపులో కొనుగోళ్లు చేసిన వివరాలపై అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీశారు. ఇడుక్కి కరుణపురంలో అతనితో కాంటాక్టు అయిన 300 మందిని గుర్తించారు. మరింత మందిని గుర్తించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ హెచ్ దినేషన్ చెప్పారు.
పుట్టాడి లోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం బేకరీలోకి వచ్చినవారి జాబితాను ఆరోగ్య అధికారులు తయారు చేశారు. బేకరీలో ఐదు నిమిషాల కంటే ఎక్కువ గడిపిన వారు చాలా మంది ఉన్నారు. అయితే, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించామని తెలిపారు. అందరినీ హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించి పర్యవేక్షిస్తున్నామన్నారు. వారిలో ఏమాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా ఆస్పత్రికి తరలిస్తామన్నారు.