
బక్రీద్ అంటే బకర్.. ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బానీ (దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బానీ అని కూడా అంటారు. ముస్లింలు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవత్వాన్ని వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది.ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే అతి ముఖ్య పండుగలు రెండు.
మొదటిది దాన ధర్మాల పండగ రంజాన్( ఈదుల్ ఫిత్ర్). రెండోది త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్(ఈదుల్ అజ్హా). రంజాన్ పండుగ మానవత్వానికి ప్రతీకగా నిలిచి తన సంపాదనలో జకాత్, ఫిత్ర, సదఖ పేరిట పేదలకు హక్కును అందించగా, బక్రీద్ తనను తాను అర్పించుకునే త్యాగానికి ప్రతీకగా నిలిచింది. తనకు అత్యంత ఇష్టమైనవి త్యాగం చేసి అల్లాహ్ ను ప్రసన్నం చేసుకునే పండుగ. ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన అయిదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. కల్మ, రోజా, నమాజ్, జకాత్ అనేవి మిగతా నాలుగు బాధ్యతలు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం. అల్లా ఆదేశాల మేరకు ఇబ్రహీం ప్రవక్త హజ్ కోసం పిలుపునిచ్చారని ఇస్లాం చెబుతోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి సుమారు ఏడు వేలకుపైగా ముస్లింలు హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లారు. అరుదైన త్యాగంఅల్లాహ్ తన ప్రవక్తలను వివిధ సందర్భాల్లో పలురకాలుగా పరీక్షించేవారు. ఇదేక్రమంలో ప్రవక్త హజరత్ ఇబ్రహీం, ఆయన భార్య బీబీ హాజ్రాలకు వారి వృద్ధాప్యంలో సంతానప్రాప్తి కలిగింది. లేకలేక జన్మించిన కొడుకు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒకరోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లాహ్ కోసం ఖుర్బానీ (బలిదానం) చేస్తున్నట్లు కలగంటారు.
దీంతో అల్లాహ్ తన కుమారుడిని ఖుర్బానీ కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడతారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్డారు. బలిచ్చే సమయంలో కొడుకుపై ఉన్న ప్రేమ అడ్డువస్తే, తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా కళ్లకు ఓ బట్ట కట్టుకొని తనను బలి ఇవ్వమంటూ తండ్రికి సూచిస్తాడు. ఆ మేరకు అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెట్టిన క్షణంలో హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు)ను ప్రత్యక్షం చేస్తారు. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్ మార్గంలో అది ఖుర్బాన్ అవుతుంది. ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండగ రోజు ఖుర్బానీ జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని సూచించినట్లు ఇస్లాం చెబుతోంది. అలా ఇబ్రహీం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ ప్రాణత్యాగానికి సిద్ధపడిన రోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంటారు. త్యాగానికి గుర్తుగా మేకలు, పొట్టేళ్లను ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
- మొహమ్మద్
షౌకత్ అలీ,
మెట్పల్లి