
- 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్కు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో కొనసాగుతున్న ఇందిరా క్యాంటీన్లలో (అన్నపూర్ణ క్యాంటీన్లు) రూ.5- భోజనంతో పాటు ఇక నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా పెట్టాలనే నిర్ణయానికి బల్దియా స్టాండింగ్కమిటీ ఆమోదం తెలిపింది. 22 అంశాలతోపాటు 10 టేబుల్ ఐటమ్స్కు సభ్యులు గురువారం ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ అధ్యక్షత 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించగా, కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్బొంతు శ్రీదేవి, బానోతు సుజాత,సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, అడిషనల్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
11 ప్రాంతాల్లో కూర్చుని తింటున్న కేంద్రాలను పునరుద్ధరించాలని, 139 ప్రాంతాల్లో షెడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. హెడ్ ఆఫీసులో ఎస్బీఐ బ్రాంచ్ లీజును -2028 వరకు పొడిగించేందుకు ఆమోదించారు. స్ట్రీట్ లైట్స్ఒప్పందం గడువు ముగియడంతో కొత్త ఏజెన్సీకి టెండర్లు ఇచ్చేందుకు ఆమోదించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో బల్దియా నిర్మించిన డబుల్ ఇండ్ల వద్ద పెండింగ్ లో ఉన్న 14 ఎస్టీపీ పనులు తిరిగి చేసేందుకు ఆమోదించారు. ఈ పనుల టెండర్లు దక్కించుకున్న రెండు సంస్థలు పనులు చేయకుండా వదిలేయడంతో జరిమానాలు విధించేందుకు కూడా ఆమోదించారు. శిల్పా లేఅవుట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కి పీజేఆర్ పేరు పెట్టేందుకు ఆమోదించారు.