అప్పుడు ఆమెను తీవ్రంగా కొట్టి.. ఇప్పుడు రాఖీ కట్టించుకున్న బీజేపీ నేత

అప్పుడు ఆమెను తీవ్రంగా కొట్టి.. ఇప్పుడు రాఖీ కట్టించుకున్న బీజేపీ నేత

అహ్మదాబాద్‌ నగరంలోని నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే బలరాం తవని నీతూ తేజ్‌వాణిని కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మంచినీటి కొరతపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన మహిళపై ఆయన కార్యాలయం వెలుపలే దాడి జరిగింది. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం తవని గట్టిగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అయితే ఈ వీడియోతో ఎంత రచ్చ అయ్యిందో..సెటిల్ మెంట్ కూడా అంతే వేగంగా జరిగింది. ఒక్క రోజులోనే ఆ మహిళతో రాఖీ కట్టించుకుని వివాదానాకి చెక్ పెట్టారు ఎమ్మెల్యే బలరాం.

దేశవ్యాప్తంగా ఈ ఘటనపై సీరియస్‌ అవ్వడంతో.. బలరాం మాట్లాడారు. ‘ఎన్సీపీ మహిళా నేత నీతూ తేజ్‌వాణితో దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించండి. ఆమె నా సోదరితో సమానం. మా మధ్య వచ్చిన అవగాహన లోపం వల్లే ఈ ఘటన జరిగింది’ అంటూ బలరాం తవని తెలిపారు. సోమవారం నీతూ తేజ్‌వాణితో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. యువతితో రాఖీ కట్టించుకున్నారు. అవగాహన లోపం వల్లే ఆదివారం ఈ ఘటన జరిగిందని అవన్నీ మర్చిపోయి ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పని చేస్తామని బలరాం అన్నారు. నీతూ తేజ్‌వాణి కూడా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేకు రాఖీ కట్టి బలరాం నా సోదరుడులాంటివాడు, మాది ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చింది. ఒకే రోజులో మ్యాటర్‌ మొత్తం సెటిల్‌ అవ్వడంతో .. సోషల్‌ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.