విశాఖ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా కేసీఆర్ పారిపోయారు : బండి సంజయ్

విశాఖ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా కేసీఆర్ పారిపోయారు : బండి సంజయ్

మొయినాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేష్టలతో రాష్ట్ర ప్రజలు తలదించుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) బిడ్జింగ్‌ లో పాల్గొనకుండా కేసీఆర్ పారిపోయారంటూ సెటైర్ వేశారు. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపైనా కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఈ విషయంతో బీఆర్ఎస్ సర్కార్ మాటలన్నీ కోతలేనని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్, -బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని చెప్పారు. బీజేపీ పోరాటాలతో బీఆర్ఎస్ గుండెలు గుభేల్ మంటున్నాయ్ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 23న చేవెళ్లలో నిర్వహించబోయే బహిరంగ సభను సక్సెస్ చేసి, సత్తా చాటుదామంటూ పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

చేవెళ్ల బీజేపీ సభ పేరు ఖరారు

ఈ నెల 23వ తేదీన చేవేళ్లలో నిర్వహించే సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. చేవెళ్ల బహిరంగ సభకు ‘విజయ సంకల్ప సభ’గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నామకరణం చేశారు. 

సభను సక్సెస్ చేస్తాం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఏప్రిల్ 23వ తేదీన లక్ష మందితో చేవెళ్ల బహిరంగ సభ నిర్వహించి.. సక్సెస్ చేసి తీరుతామని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ సీటును బీజేపీ కైవసం చేసుకోవడం ఎప్పుడో ఖాయమైందన్నారు. కేసీఆర్ సర్కార్ పోవాలంటే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను బీజేపీ గెలవాల్సిందే అని చెప్పారు. బహిరంగ సభకు తక్కువ సమయం ఉన్నా.. చేవెళ్ల సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.