కేసీఆర్ ఎందుకు రాలే.. సన్మానం చేసేందుకు శాలువా కూడా తీసుకువచ్చా : బండి సంజయ్

కేసీఆర్ ఎందుకు రాలే..  సన్మానం చేసేందుకు శాలువా కూడా తీసుకువచ్చా :  బండి సంజయ్

ప్రధాని మోడీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇవాళ్టి  షెడ్యూల్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  సీఎం కేసీఆర్ కోసం తాను చాలా ఎదురుచూశానన్న సంజయ్...  కేసీఆర్ కు సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని అన్నారు.  దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ కు  వస్తే కేసీఆర్ ఎందుకు రారన్నారు.  కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.  రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని, కుటుంబ, నియంత, అవినీతి పాలన అంతం కావాలని చెప్పారు.   రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ  రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు. 

అటు పలు  అభివృద్ధి పనులు ప్రారంభించటానికి హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడీ.. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పాలన తీరును ఎండగట్టారు. సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండానే చురకలు అంటించారు.  రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందన్నారాయన. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు. కుటుంబం పాలన, అవినీతి వేర్వేరు కాదంటూనే.. ఇలాంటి వారిపై పోరాడాలా వద్దా అని ప్రజలను ప్రశ్ని్ంచారు. హైదరాబాద్ పర్యటన అనంతరం మోడీ చెన్నైకి వెళ్లిపోయారు.