ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా ? : బండి సంజయ్

ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా ? : బండి సంజయ్

టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని.. పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో బండి సంజయ్ మాట్లాడారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారని ఆరోపించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు.. రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఎన్ని ఇండ్లు ఇచ్చింది..? డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని ఇచ్చారో కేసీఆర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి బండారం బయట పెడతా

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం  నెరవేర్చారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇటీవల గుజరాత్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి బండారం బయట పెడతానని..కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినవ్.. ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నవా అంటూ మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుంచే వస్తాయన్నారు.  

అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలని.. డబుల్ ఇంజన్ సర్కార్, కమలం వికసించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని..ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఇస్తోందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత మోడీదని అన్నారు. అలాగే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మీరు తెరిపిస్తారా.. మేము తెరిపించాలా..? అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు.

సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం

కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముప్పై గ్రామాలకు సరిపోయేంత కరెంట్ ను ఫామ్ హౌస్ లో కేసీఆర్ వాడుతున్నారని విమర్శించారు. మెట్రో పక్కన తన భూములకు ధరలు రావాలని..కేసీఆర్ మళ్లీ మెట్రో కావాలని అంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.