రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటు : బండి సంజయ్

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటు : బండి సంజయ్

బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంచలనం కోసమే వారు  రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని ఆరోపించారు. రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదన్న విషయం వారు మర్చిపోయారని విమర్శించారు. ప్రెసిడెంట్ స్పీచ్ విన్న తర్వాత ఎవరూ  కూడా బహిష్కరించాలనుకోరని అన్నారు. పార్లమెంటులో సహృద్బావ వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోడీ ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని బండి గుర్తు చేశారు. 

రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసిఆర్ మహిళా ద్వేషి అని అందుకే ఫస్ట్ కేబినేట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని అన్నారు. కేసీఆర్ మహిళా గవర్నర్ ను అవమానిస్తున్నారన్న బండి.. హైకోర్టులో ఆమెపై కేసు ఎందుకు వేశారో తెలియక జనాలు నవ్వుతున్నారని అన్నారు. గవర్నర్ అంటే వారికి గౌరవం లేదని... వాస్తవాలు మాట్లాడితే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.