కరీంనగర్: హుజురాబాద్ లో జరిగిన బీజేపీ నేతల మీటింగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వమే నా శ్వాస.. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు.
జీహెచ్ఎంసీలో హిందుత్వం వల్లే 4 నుంచి 48 సీట్లు గెలిచామన్నారు బండి సంజయ్. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. మరి ఆ ముస్లీంలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారని ప్రశ్నించారు. 12 శాతం ముస్లింలంతా ఒక్కటైతే తప్పు లేనిది 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంటని అన్నారు. హిందుత్వ వాదంతోనే గడపగడపకూ తిరుగుతా తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొస్తామని అన్నారు. ఎవరు కాదన్నా..ఔనన్నా..కరీంనగర్ లో హిందూ ఓట్లతోనే తాను గెలిచానని చెప్పారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు నయాపైసా రాదన్నారు బండిసంజయ్. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుందన్నారు. కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయన్నారు.
