
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. తమలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నారని విమర్శించారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందన్నారు. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు వచ్చారని చెప్పారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ను బహిరంగ పర్చాలన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు తనతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ , జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడని అన్నారు.
ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయని విమర్శించారు. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు బండి సంజయ్. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడన్నారు. ఆయనవల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారని తెలిపారు. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు. ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారని ప్రశ్నించారు.
కోర్టు నిబంధనలకు లోబడి ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. 18 నెలల పాలనలో ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదని విమర్శించారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని... ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనన్నారు బండి సంజయ్.