కృష్ణా జలాల ఒప్పందంతో ప్రాజెక్టుకు నీళ్లు లేని పరిస్థితి: సంజయ్

కృష్ణా జలాల ఒప్పందంతో ప్రాజెక్టుకు నీళ్లు లేని పరిస్థితి: సంజయ్
  • కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్​తో భేటి
  • నీటి వాటా పెంచి ప్రాజెక్టుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి
  • కరీంనగర్-హసన్​పర్తి రైల్వే లైన్​పై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ చేసిన తప్పిదం దక్షిణ తెలంగాణ ప్రజలకు శాపమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఆనాడు 299 టీఎంసీలకు అంగీకరించడం వల్ల ఇప్పుడు పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లులేని పరిస్థితి నెలకొందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల వనురుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలిసి సంజయ్ కేంద్ర జనవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటి అయ్యారు. కృష్ణా జలాల వాటా, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇతర ప్రాజెక్ట్ ల అనుమతులపై  కేంద్ర మంత్రి షెకావత్​కు వినతిపత్రం సమర్పించారు. అలాగే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కూడా కలిసి కరీంనగర్–హసన్ పర్తి రైల్వే లైన్ నిర్మించాలని, సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో స్టేషన్ ను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. 

కొమురవెల్లిలో రైలు హాల్ట్​కు సానుకూలం

దశాబ్దాలకుపైగా పెండింగ్​లో ఉన్న కరీంనగర్–హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. అందులో భాగంగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన రీసర్వే చేసి నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నతాధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు. అలాగే సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో స్టేషన్ నిర్మాణం, రైలు హాల్ట్ పై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన జాబితాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కు చోటు కల్పించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కోరారు.

‘పాలమూరు’కు పర్మిషన్​ ఇవ్వండి

పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందని కేంద్ర మంత్రికి సంజయ్ తెలిపారు. కృష్ణా జలాల వాటా కేటాయింపుల సందర్భంగా సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి, 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు, తప్పిదాలకు తెలంగాణ ప్రజలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపులతోపాటు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంజయ్ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. వెంటనే డీపీఆర్ ను కేంద్ర జలవనరుల సంఘానికి (సీడబ్ల్యూసీ) పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ పనుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.