
ఢాకా: బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. ఇసుక రవాణా చేస్తున్న కార్గో షిప్ ఢీ కొట్టడంతో పడవ మునిగి, 21 మంది చనిపోయారు. బంగ్లాదేశ్ బిజోయ్నగర్ సిటీలోని సరస్సులో శుక్రవారం ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు వివరించారు. కార్గో షిప్ యొక్క స్టీల్ టిప్ తగలడంతో ప్రయాణికుల పడవ బోల్తా పడిందని తెలిపారు. తొమ్మిది మంది మహిళలు, ఆరుగురు పిల్లలు సహా 21 డెడ్బాడీలను రికవర్ చేశామని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. గల్లంతైన వారి కోసం డైవర్లు సెర్చ్ చేస్తున్నారని, సహాయక చర్యల కోసం ఇంకొంత మంది డైవర్లను రప్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. నీట మునిగిన వారిలో ఏడుగురు ప్రయాణికులను కాపాడి స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చడానికి అధికారులు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.