ఢాకా: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం మంగళవారం కొలువుదీరనుంది. ప్రధానిగా బీఎన్పీ చీఫ్ తారిఖ్ రహ్మన్తో అధ్యక్షుడు మొహమ్మద్ షాహాబుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. వాస్తవానికి కొత్త ఎంపీలతో పార్లమెంట్ స్పీకర్ ప్రమాణం చేయించాల్సి ఉందని, కానీ.. స్పీకర్ రాజీనామా చేసి గుర్తుతెలియని ప్రాంతంలో నివసిస్తున్నారని పార్లమెంటరీ శాఖ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ జైల్లో ఉండడంతో ఎంపీలతో సీఈసీ ప్రమాణం చేయించనున్నారని వెల్లడించారు.
బంగభవన్ (అధ్యక్షుడి ప్యాలెస్)లో ఈ కార్యక్రమం జరగనుందని ఆయన చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన వెంటనే పార్లమెంటరీ పార్టీ లీడర్ ను ఎన్నుకుంటామని బీఎన్పీ వెల్లడించింది. కాగా.. ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఆయన తరపున లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని విదేశాంగ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
