విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అనంతరం మరో రుణ ఎగవేతదారుడు వెలుగులోకి వచ్చాడు. ముంబైలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ను బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారునిగా ప్రకటించింది. దిగి పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ విజయ్ గోవర్థన్ దాస్ కలంత్రి, ఆయన కుమారుడు పోర్ట్ డైరెక్టర్ విశాల్ కలంత్రి బ్యాంక్ ఆఫ్ బరోడా నేతృత్వంలోని 16 ఇండియన్ బ్యాంక్ల కన్సార్షియానికి సుమారు రూ.3,334 కోట్ల రుణాలు కట్టకుండా ఉద్దేశపూర్వకంగా ఎగొట్టినట్టు పేర్కొంది.
ఈ రుణాలను పోర్ట్ అభివృద్ధి కోసం ఇచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముంబై న్యూస్పేపర్లో పబ్లిక్ నోటీసు కూడా జారీ చేసింది.ఈ నోటీసులో..బ్యాంకింగ్/ఆర్బీఐ నియమ నిబంధనల కింద విజయ్ బ్యాంక్(ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా) పలువురిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. వారిలో ఒకరు దిగి పోర్ట్ లిమిటెడ్(రుణ గ్రహీత), రెండోవారు విశాల్ విజయ్ కలంత్రి, డైరెక్టర్ అండ్ గ్యారెంటర్, మూడోవారు విజయ్ గోవర్థన్ దాస్ కలంత్రి, డైరెక్టర్ అండ్ గ్యారెంటర్గా ముంబై న్యూస్పేపర్లో పేర్కొంది.
వీరిని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటిస్తున్నట్టు తెలుపుతూ వీరికి బ్యాంక్ సంబంధిత సమాచారం కూడా అందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఆర్బీఐ అనుమతి మేరకు, వారి ఫోటోలను కూడా పబ్లిక్గా ప్రచురించింది. ఈ విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా విజయ్ కలంత్రిని సంప్రదించాలని ప్రయత్నించగా.. సాధ్యం కాలేకపోయింది.