
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ మరోసారి ప్రదర్శించడంతో ఏబీవీపీ ధర్నాకు దిగింది. హెచ్ సీయూలో వీడియో స్క్రీనింగ్ ను ఆపాలంటూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించింది. బీబీసీ డాక్యుమెంటరీకి ప్రదర్శనకు నిరసనగా ఏబీవీపీ నార్త్ బ్లాక్ లో కాశ్మీరీ ఫైల్స్ మూవీని ప్రదర్శించింది. ఈ రెండు గ్రూప్ ల హోరాహోరీ నినాదాలతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు.
ప్రధాని మోడీపై ఇంటర్నేషనల్ మీడియా బీబీసీ తీసిన ఇండియా: ద మోడీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా డాక్యుమెంటరీ ఉందంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని ఇండియాలో ప్రదర్శించవద్దని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. అయితే కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.