బషీర్ బాగ్, వెలుగు : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేసి ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఇందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో పార్లమెంట్ ముట్టడించనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని కాచిగూడ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.
బీసీలు పార్టీలకతీతంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు రాజ్యాంగ హక్కుల కోసం త్వరలోనే దేశవ్యాప్త పర్యటన చేస్తామని పేర్కొన్నారు. 25న హైదరాబాద్ బీసీ ఉద్యోగుల సమావేశం, 28న మహబూబ్ నగర్ లో బీసీ టీచర్ల సమావేశం, 29న కడపలో బీసీ ఉద్యోగుల బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ , సుందరయ్య , నీల వెంకటేష్, సి.రాజేందర్ తదతరులు పాల్గొన్నారు.