- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
- రిజర్వేషన్లు, ప్రమోషన్లపై కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు నాటి నుంచి ఇప్పటివరకు ట్రాన్స్ కో చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. గురువారం ట్రాన్స్ కో ఆఫీస్ లో సీఎండీ కృష్ణభాస్కర్, డైరెక్టర్లు శ్రీనివాసులు, లత వినోద్, మెంబర్లు బాలలక్ష్మి, జయప్రకాశ్, సురేందర్, మెంబర్ సెక్రటరీ బాలమాయదేవితో కలిసి ఆయన రివ్యూ నిర్వహించారు. ట్రాన్స్ కో లో రిజర్వేషన్ల అమలులో బీసీలకు జరిగిన అన్యాయాలు ఇతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. గత 12 ఏండ్ల నియామకాల వివరాలను 15 రోజులుగా బీసీ కమిషన్కు ఇవ్వాలని చైర్మన్ ఆదేశించారు.
వివిధ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన వివరాల గురించి సంస్థ ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఉద్యోగుల ప్రమోషన్లు, సీనియారిటీ ఇతర అంశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. 2014 నుంచి డైరెక్టుర్లుగా పనిచేసిన వారి వివరాలు, వారి సామాజిక వర్గంతో సహా కమిషన్కు అందజేయాలన్నారు. ట్రాన్స్ కో లో బీసీ సెల్ ఏర్పాటుకు ఆఫీసు కేటాయించాలని సీఎండీని కమిషన్ ఆదేశించింది.
