- బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయి రూ.90 కోట్లు
- అప్పులు చేసి పిల్లల్ని విదేశాలకు పంపించిన పేరెంట్స్
- స్కాలర్షిప్స్ రాక పెరిగిపోతున్న వడ్డీలు
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్స్కు ఆర్థిక సాయం చేసేందుకు తీసుకొచ్చిన బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్సరిగా అమలు కావడం లేదు. రెండేండ్లుగా స్కాలర్షిప్స్ను సర్కారుపెండింగ్లో పెట్టడంతో దాదాపు రూ.90 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఎంపిక పూర్తయి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వచ్చేసిందని, కేవలం నిధులు రిలీజ్ చేయకపోవడంతోనే సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
రెండేండ్లుగా ఇదే పరిస్థితి
బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ విదేశాలల్లో పీజీ, ఇతర ఉన్నత కోర్సులు చదివేందుకు మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకాన్ని రాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది. దీని కింద యేటా 300 మందికి స్కాలర్షిప్ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో స్టూడెంట్ కు రూ.20 లక్షలు ఇస్తారు. ఎంపికయ్యాక ఫస్టియర్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద రూ.10 లక్షలు, సెకండియర్లో అన్ని డాక్యుమెంట్స్ జత చేశాక మరో రూ.10 లక్షలు చెల్లిస్తారు. కానీ రెండేండ్లుగా స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇవ్వడంలేదు. కనీసం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు.
600 మందికి చెల్లించాలె..
సుమారు 600 మందికి రూ.90 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఎప్పుడో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. కానీ ఆర్థిక శాఖ నుంచే అప్రూవల్ రాలేదు. దీంతో ఒకసారి బడ్జెట్ లాప్స్ అయిపోయింది. నిధులు లేకపోవడం వల్లే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది.
అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నరు
సర్కారు నుంచి సాయం అందుతుందనే ఉద్దేశంతో పేరెంట్స్ బంగారం, ఇండ్లు, ల్యాండ్స్ కుదవపెట్టి బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి పిల్లల్ని విదేశాలకు పంపించారు. అక్కడికెళ్లాక పిల్లలు జాయినింగ్ డాక్యుమెంట్స్ పంపిస్తే పేరెంట్స్ వాటిని ఇక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. తెచ్చిన అప్పులకు రెండేండ్లుగా వడ్డీలు కడుతూనే బీసీ సంక్షేమ శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉందని అధికారులు తిప్పి పంపుతున్నారని పేరెంట్స్ వాపోతున్నారు.
పిల్లల చదువులకు నిధుల్లేవా?
రెండేండ్లుగా స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం అన్యాయం. బీసీల నిధులను సర్కారు పక్కదారి పట్టిస్తోంది. కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్న సర్కారు.. బీసీలకు వంద కోట్లు ఇవ్వలేదా? రాష్ట్రంలో బీసీలు 52 శాతం ఉన్నరు.. కేవలం 300 మంది పిల్లలనే ఎంపిక చేశారు.. ఆ నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు. బీసీలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
- ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు