- ఓటర్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బై పోల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి.
ఆదివారం ఈ లేఖను హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వివిధ సంఘాల నేతలతో కలిసి మీడియాకు విడుదల చేశారు. జాజుల మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ లో ఏమి జరగబోతుందా అని దేశమంతా ఎదురుచూస్తున్నదని, ఈ ఎన్నిక మీదనే బీసీల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని తెలిపారు.
ఇలాంటి కీలక సమయంలో అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు అసెంబ్లీలో 19 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు.
నవీన్ యాదవ్ గెలుపుతో.. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలలో టికెట్లు ఇవ్వకుండా నిరాకరించిన బీసీ వ్యతిరేక పార్టీలకు తమ ఓటు ద్వారా బీసీలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
