
- బీసీలను పట్టించుకోకపోవడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు
ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం 60 శాతం ఉన్న బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ప్రగతి భవన్ ముందు ఇనుప గ్రిల్స్ తొలగింపు, భవన్కు మహాత్మా జ్యోతి రావు ఫూలే పేరు పెట్టడం అభినందనీయమన్నారు.
అదే విధంగా సిటీలో 5 ఎకరాల భూమి కేటాయించి పూలే స్మృతి వనం నిర్మించి, ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. తమ సమస్యలను వివరించేందుకు మాజీ సీఎం కేసీఆర్ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ బీసీలను విస్మరించినందునే అధికారం కోల్పోయారన్నారు. సమావేశంలో గొల్ల కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంఘాల నేతలు గణేశ్చారి, దుర్గయ్య గౌడ్, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.