- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామ సర్పంచ్ ఎరుకల యతీశ్వర్ గౌడ్ను తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించి సర్పంచ్లకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు బత్తిని రాజు గౌడ్, మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర సలహాదారులు ఘనగాని మల్లేశ్, గొడుగు మహేశ్యాదవ్, తాటికొండ విక్రం, మహేశ్ మేరు, ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
