- టీ20 వరల్డ్కప్, ఐపీఎల్పై ఫోకస్
- నేడు బీసీసీఐ ఎస్జీఎమ్
- డొమెస్టిక్ ప్లేయర్ల పేమెంట్స్పైనా చర్చ
వాయిదా పడిన ఐపీఎల్ 14ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి..? సందిగ్దంలో ఉన్న టీ20 వరల్డ్కప్ను ఎలా నిర్వహించాలి..? బైలేటరల్ సిరీస్ల విషయంలో ఏం చేయాలి..? డొమెస్టిక్ టోర్నీలను ఎలా గాడిలో పెట్టాలి.. దేశవాళీ ప్లేయర్లకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి..? ఇలా ఒక్కో అంశంపై నేడు జరిగే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో బీసీసీఐ సవివరంగా చర్చించనుంది..! టీ20 వరల్డ్కప్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తితో పాటు.. ఐపీఎల్కు ఫారిన్ ప్లేయర్లను ఎలా రప్పిస్తారన్న సందేహాలకు కూడా ఈ మీటింగ్లో జవాబు దొరికే చాన్స్ ఉంది!!
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్లుగానే.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఫిక్స్ చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా శనివారం జరిగే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ (ఎస్జీఎమ్)లో దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అరబ్ గడ్డపై మూడు వారాల విండోలో లీగ్ను కంప్లీట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇండియాలో కరోనా కేసుల నేపథ్యంలో.. రాబోయే సీజన్ ఎలా ఉండాలన్న ప్రధాన ఎజెండాతో ఈ మీటింగ్ జరగనుంది. ఇక అన్నింటికంటే ఆసక్తి రేపుతున్న ఐసీసీ టీ20 వరల్డ్కప్ హోస్టింగ్పై ప్రధాన చర్చ జరగనుంది. ఎందుకంటే దేశంలో ప్రస్తుత పరిస్థితి బాగాలేకపోవడంతో.. మెగా ఈవెంట్ను యూఏఈకి తరలించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 1న ఐసీసీ సమావేశం కానుంది. దీంతో ఇంటర్నేషనల్ బాడీ భిన్నమైన నిర్ణయం తీసుకుంటే.. ఏం చేయాలన్న దానిపై బీసీసీఐ సమాలోచనలు చేయనుంది. లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ సీజన్ క్యాన్సిల్ కావడంతో డొమెస్టిక్ ప్లేయర్లకు పరిహారం ఎలా ఇవ్వాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. ముంబై నుంచి ఈ మీటింగ్ను వర్చువల్గా కండక్ట్ చేయనున్నాడు. ‘ప్రస్తుతం మాకున్న ప్రధాన ఎంజెండా ఐపీఎల్ షెడ్యూల్. మేం 10 డబుల్ హెడర్స్, 7 సింగిల్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లని అనుకుంటున్నాం. లీగ్ రీస్టార్ట్, ఎండింగ్.. వీకెండ్స్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. దీనికి బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నాడు.
ఫారిన్ ప్లేయర్ల గురించి ఆలోచిస్తున్నాం..
సెప్టెంబర్, అక్టోబర్ విండోలో చాలా కంట్రీస్ ఇంటర్నేషనల్ సిరీస్లో బిజీగా ఉండనున్నాయి. దీంతో ఫారిన్ ప్లేయర్లను ఎలా రప్పించాలన్న దానిపై చర్చ జరగనుంది. లాజిస్టిక్ అంశాలతో పాటు బబుల్ టు బబుల్ ట్రాన్స్ఫర్ గురించి కూడా మాట్లాడొచ్చు. ఐపీఎల్ కంటే నేషనల్ డ్యూటీయే తమకు ముఖ్యమని ఈసీబీ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో దాదా, సెక్రటరీ జైషా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. బట్లర్, స్టోక్స్, ఆర్చర్, బెయిర్స్టో, సామ్ కరన్, మోర్గాన్, మొయిన్ అలీ.. తమ ఫ్రాంచైజీల్లో ప్రధాన ప్లేయర్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లను రీప్లేస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి కచ్చితంగా ఈసీబీని ఏదో రకంగా ఒప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. సెప్టెంబర్ 14న ఇంగ్లండ్తో లాస్ట్ టెస్ట్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ప్లేయర్లను డైరెక్ట్గా చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ తీసుకురావాలని బోర్డు ప్లాన్ చేస్తోంది. అయితే ఇందుకు ఈసీబీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
కివీస్, సౌతాఫ్రికాతో సిరీస్లు రద్దు?
టీ20 వరల్డ్కప్కు ముందు ఇండియా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో ఆరు వైట్బాల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ ఐపీఎల్ సెకండ్ ఫేజ్.. సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 మధ్య షెడ్యూల్ చేశారు. కాబట్టి ఐపీఎల్ ఆడాలంటే.. ఈ రెండు సిరీస్లను క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక మెగా లీగ్ ముగిసిన తర్వాత నవంబర్లో కివీస్.. ఇండియాతో రెండు టెస్ట్ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిరీస్ను ఎలా షెడ్యూల్ చేయాలనేదానిపై ఎస్జీఎంలో చర్చించే అవకాశం ఉంది.
రంజీ ట్రోఫీ పరిహారం..
లాస్ట్ సీజన్లో రంజీ ట్రోఫీ క్యాన్సిల్ కావడంతో దాదాపు 700 మంది సీనియర్ డొమెస్టిక్ క్రికెటర్స్ (మెన్స్) చాలా ఇబ్బందులపాలయ్యారు. అయితే వీళ్లందరికి పరిహారం అందజేస్తామని బీసీసీఐ జనవరిలోనే హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వాళ్లకు ఎలాంటి ప్యాకేజ్ అందలేదు. దీనిని ఎలా వర్కౌట్ చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ‘కేవలం 73 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఐపీఎల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీలో ఆడటం వల్ల ఒక్కో మ్యాచ్కు రూ. 35 వేలు అందుతాయి. కానీ లాస్ట్ ఇయర్ మ్యాచ్లు లేకపోవడంతో ప్లేయర్లు చాలా ఆదాయం కోల్పోయారు. కనీసం కొంతైనా వాళ్లకు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. అయితే ఒక్కో స్టేట్కు ఏక మొత్తంలో ప్యాకేజ్ ఇవ్వడమే సరైన పరిష్కార మార్గమనుకుంటున్నాం. దీంతో గత సీజన్లోని రోస్టర్ ప్రకారం ప్లేయర్లకు ఈ డబ్బులను ఆయా స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి’ అని సీనియర్ అధికారి వ్యాఖ్యానించాడు.
వరల్డ్కప్పై నిర్ణయం ఎలా?
అక్టోబర్లో టీ20 వరల్డ్కప్ నిర్వహణపై డౌట్స్ మొదలైన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు హోస్టింగ్ రైట్స్ను ఇండియా వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే టైమ్లో ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే చాన్స్ ఉందని మెడికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో మెగా ఈవెంట్ను ఏం చేయాలన్న దానిపై అటు బీసీసీఐ, ఇటు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. ఒకవేళ యూఏఈలో ఫుల్ ఐపీఎల్ జరిగి ఉంటే పిచ్లు దెబ్బతినే చాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు సగం మ్యాచ్లే జరుగుతున్నాయి కాబట్టి.. మూడింటిలో రెండు గ్రౌండ్స్ను టీ20 వరల్డ్కప్ కోసం పక్కనబెట్టాలని ఎమిరైట్స్ క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐని కూడా ఐసీసీ అడిగే చాన్స్ ఉంది. దీంతో ఒక గ్రౌండ్లోనే ఐపీఎల్ను కంప్లీట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

