- బీసీఐఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్వేణుకుమార్
మెదక్టౌన్, వెలుగు: బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీసీఐఎఫ్(బీసీ ఇంటలెక్చువల్ ఫోరం) రాష్ట్ర కో-ఆర్డినేటర్ అవ్వారు వేణు కుమార్ అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో ని కేవల్కిషన్ భవనంలో బీసీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ సామాజిక న్యాయ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తామని ప్రకటించిందని, కానీ ఈ హామీ నీటి మూట అని తేలిపోయిందన్నారు.
ప్రభుత్వం తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రేక్షక పాత్ర వహించడం మానేసి ఈ అంశాన్ని తక్షణమే టేకప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీల పట్ల బాధ్యతగా నిలబడి 42 శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ బీసీఐఎఫ్ నాయకులు సత్యనారాయణ, రాజు యాదవ్, ముదిరాజు సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లేశ్, సుధాకర్ గౌడ్, శిరీష్ కుమార్ పాల్గొన్నారు.
