
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు గడిచినా ఈ రాష్ట్ర నిర్మాణానికి అత్యధికంగా శ్రమించిన, అతి పెద్ద జనాభా శాతాన్ని కలిగి ఉన్న బీసీ వర్గాలకు నేటికీ రాజకీయ ప్రాతినిధ్యం బలహీనంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం ఓటును వినియోగించుకునే శక్తి ఉన్నా, పాలనా శక్తిని అభివృద్ధి చేసుకునే రాజకీయ చైతన్యం లేకపోవడం.
ఈ లోపాన్ని తొలగించాలంటే తెలంగాణ బీసీలకు ఒక సమష్టి రాజకీయ వేదిక తప్పనిసరి. నిజాం కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ సమైక్య పాలన వరకూ బీసీలు పాలనలో చివరి వరుసకే పరిమితమయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేస్తుందనే ఆశలు ఉన్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. తెలంగాణలో ఆంధ్ర శాసనాధికారులు కొన్ని దశాబ్దాలుగా భాష, సంస్కృతి, వనరుల అధీనంగా పాలించారు. ఇదే సమయంలో అధికశాతం బీసీలుగా ఉన్న తెలంగాణలో రాజకీయంగా వెనుకబడి, సామాజికంగా అణచివేతకు గురయ్యారు.
మ న చరిత్రలో చూస్తే వందల ఏళ్లుగా పాలన, విద్య, ఆర్థిక వనరులపై పెత్తందారి వర్గాల ఆధిపత్యం కొనసాగింది. బ్రిటిష్ రాజ్యాధికారం, తరువాత స్వాతంత్ర్యానంతరం వచ్చిన రాజ్యాంగం కొన్ని నిబంధనలు కలిపినా వాస్తవ జీవితాల్లో బీసీల స్థానం అనుకున్నంత ఎదగలేకపోయింది. స్కీములు, రిజర్వేషన్లు, సబ్సిడీలు అన్నీ పూనుకుని వచ్చినా, పాలనా స్థాయికి చేరలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే మొదలైన కొత్త రాజకీయ అధ్యాయానికి జనాభాలో అర్థభాగానికి పైగా బీసీ వర్గాల ఆశలు, ఆకాంక్షలు మూటగట్టబడ్డాయి. కానీ పదేళ్ళకాలంలో ఈ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, పాలనా అధికారంలో గౌరవస్థానం సుస్థిరంగా దక్కలేదు.
సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భూమిక
రెండు శాతం ఓట్లు లేని పార్టీలు సైతం సంకీర్ణ ప్రభుత్వాలలో చేరి కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు ఉన్న సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక ఎమ్మెల్యేని సాధించుకోవడమేకాక తాజాగా ఒక ఎమ్మెల్సీని కూడా సాధించింది. కేవలం పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం పార్టీ ఏడు సీట్లతో ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా, తమ వర్గ పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తోంది.
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా పోటీ చేసి ఖాతా తెరవని జనసేన పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే సీట్లు సాధించడమేకాక, ప్రభుత్వంలో చేరి మంత్రి పదవులు సాధించింది. తాజాగా ఒక ఎమ్మెల్సీని సైతం కైవసం చేసుకుంది. కేవలం రెండు శాతం లేని పార్టీలు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నప్పుడు 50 శాతానికిపైగా ఉన్న బీసీలు ఏం చేయాలో ఆలోచించాలి.
బహుజన నాయకత్వం - పాఠాలు
రాజస్థాన్కు చెందిన హనుమాన్ బినివాల్ తన జాట్ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని భావించి 2018లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీని స్థాపించారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏతో పొత్తు, తద్వారా కేంద్రాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన అప్నాదళ్ పార్టీ కుర్మి అనే బలమైన బహుజన వర్గానికి ప్రాతినిధ్యం చేస్తోంది. ఈ పార్టీ అధినేత అనుప్రియా పటేల్, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని తమ వర్గానికి ప్రత్యేక అభివృద్ధి పథకాలు, కేంద్రంలో స్థానాలు పొందారు. సామాజిక స్ఫూర్తితో రాజకీయాన్ని మేళవిస్తే సాధ్యమవుతుంది. ఇది ‘ఓటు ఒక్కటైతే చాలు’ అనే మాటను బలపరుస్తుంది. ఎక్కువ మంది ఉన్న ఓటర్లు ఉంటే, తాము కోరినవిధంగా పాలసీ డిజైన్ను ప్రభావితం చేయగలుగుతారు.
నిందించడం ఎందుకు?
బీసీలు శతాబ్దాలుగా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నామని, అగ్రవర్ణాల పాలకులను నిందించడం తరచు వినిపించే వాదన. కానీ, నిజంగా ఆ అధికారానికి బలమిచ్చింది ఎవరు? ఓటురూపంలో అవకాశం ఇచ్చింది మనమే కదా. పదే పదే తమను వెనక్కి నెట్టేవారికే ఓటు వేస్తూ, తరువాత వారి పాలనపై గళం ఎత్తడం ఎంతవరకు న్యాయం? నిందించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. అందుకే నిందించకుండా జవాబుదారీతనంతో ముందుకు సాగడమే నిజమైన పరిష్కారం.
రాజకీయ స్వచ్ఛందత, సామూహికత, వర్గ చైతన్యం లేకుండా అధికారం సాధ్యం కాదు. కావున, నిందల పంథాను విడిచి, తాము ఎవరికి ఓటు వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు? అనే ప్రశ్నలను ప్రతి ఓటరు అడిగే సమయం ఇది. చైతన్యం కలిగి ఉంటే అధికారం మనదవ్వడంలో ఎలాంటి అడ్డంకి ఉండదు. తెలంగాణ బీసీలు ఇప్పుడు ఓ కొత్త దిశలో ఆలోచించాలి. ఓటు వేయడమే కాదు. ఓటు విలువను పెంచేలా స్వతంత్ర రాజకీయ వేదికను నిర్మించాలి.
ఓటు బ్యాంకుగా బీసీలు
తెలంగాణలో బీసీల శాతం సుమారుగా 50% కి పైగానే ఉంటుంది. కానీ, అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు మాత్రం 15-–18 శాతమే. ఓటు వేయడంలో ముందుండే బీసీలు, పార్టీలకు ఓటుబ్యాంకుగా ఉన్నా పాలించడంలో మాత్రం కనుమరుగవుతున్నారు. స్వతంత్రంగా గెలవలేకపోవచ్చు. కానీ, తమ ఉనికిని చాటుకోవచ్చు. బీసీలు ఓ పార్టీ ఏర్పాటు చేసి ఎకాఎకి అధికారంలోకి రావడం సాధ్యం కాదు. కానీ, బలమైన సిద్ధాంత ప్రాతిపదికతో పార్టీ స్థాపించి ప్రజల్లో చైతన్యం రేకెత్తించి, అవసరమైన చోట వ్యూహాత్మకంగా పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకుని, అసెంబ్లీలోకి ప్రవేశించి ప్రాతినిధ్యం పొందితే, బీసీ వర్గానికి ఒక స్పష్టమైన రాజకీయం, ఉనికిని, భవిష్యత్తు మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చు.
యర్రమాద వెంకన్న