
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్సృజన ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సృజన సూచించారు. మురుగు కాల్వల్లో మురుగు నీరు నిల్వ కాకుండా చూడాలన్నారు. నీరు నిలిచే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ తప్పకుండా చల్లించాలని కోరారు. మంచినీటి పైపుల లైన్లలో లీకేజీలు లేకుండా అరికట్టాలని చెప్పారు. ప్రజలు నీటిని వేడిచేసి చల్లార్చి తాగేలా దండోరాతో అవగాహన కల్పించాలని చెప్పారు.
వారానికో రోజు “డ్రై డే” నిర్వహించాలని సూచించారు. హో టళ్లు, మాంసం మార్కెట్లు, చిరుతిండి బండ్ల వద్ద, దుకాణాలలో నిల్వ చేసే వస్తువులపై నిఘా వేసి ఉంచాలని ఆదేశించారు. నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్, ఫీనాయిల్ చల్లడం వంటి పనులు చేయడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పల్లెల్లో ప్రతిరోజూ సాయంత్రం ఫాగింగ్ చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి వనరులను, ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని అధికారులకు సృజన విజ్ఞప్తి చేశారు.