- హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
సిమ్లా: దేశంలో అసాధ్యం అనిపించిన దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సుసాధ్యం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆయన ప్రస్తావించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా సిర్మౌర్ జిల్లాలో ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు. ‘‘కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దవుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా..? ఆ పనిని మా ప్రభుత్వం చేసి చూపించింది. ఆర్టికల్ 370ని రద్దుచేసింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ‘మందిర్ వహీ బనాయేంగే, తిథి నహీ బతాయేంగే’ అని కాంగ్రెస్ మమ్మల్ని తిట్టేది. కానీ, ఇప్పుడు మందిర నిర్మాణాన్ని మోడీ ప్రారంభించారు. రాజకీయాల్లో పరివార్ వాదాన్ని ప్రధాని అంతంచేశారు. ఢిల్లీలోని రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చి, అక్కడ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు” అని షా పేర్కొన్నారు.