
- వసతులు కల్పిస్తే సందర్శకులు పెరిగే ఛాన్స్
ఆసిఫాబాద్, వెలుగు : ప్రకృతి అందాలకు పేరైన ఆసిఫాబాద్ అడవుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎన్నో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఈ జలపాతాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. అయితే ఈ జలపాతాల గురించి ప్రచారం లేకపోవడం, ఇక్కడ మౌలిక వసతులు కనిపించకపోవడంతో టూరిస్టుల సంఖ్య తక్కువగా ఉంటోంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆదివాసుల పల్లెలకు సమీపంలో ఉన్న ఈ వాటర్ఫాల్స్ను డెవలప్ చేసినట్లేయితే పర్యాటకులు పెరగడంతో పాటు, ఆదివాసీలకు ఉపాధి సైతం దొరికే అవకాశం ఉంది.
జిల్లాలోని జలపాతాలు ఇవే..
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల, చింతలమాదర సమీపంలో ఉన్న జలపాతాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. ఎత్తెన గుట్టల నుంచి జాలువారుతున్న ఈ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పంగిడిమాదర జలపాతం తిర్యాణి మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. చింతలమాదర గ్రామం నుంచి అటవీ ప్రాంతంలో రెండు కిలోమీటర్లు కాలినడకన పోతే ఈ జలపాతం కనిపిస్తుంది.
తిర్యాణి మండల కేంద్రం నుంచి రోంపల్లి మీదుగా 15 కిలోమీటర్ల వెళ్తే మంగి అటవీ ప్రాంతంలో గుండాల జలపాతం వస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సమతుల గుండం జలపాతం ఉంటుంది.
పొచ్చెర జలపాతం తిర్యాణి మండలం కౌఠగాం గ్రామ సమీపంలోని అడవిలో ఉంది. ఈ జలపాతం చుట్టూ ఎత్తెన కొండలు ఉండగా సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు పడుతోంది. జిల్లా కేంద్రం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఉందీ పొచ్చెర జలపాతం. ఆసిఫాబాద్ నుంచి గుడిపేట్ వరకు రోడ్డు సౌకర్యం ఉన్నా.. అక్కడి నుంచి పొచ్చెర జలపాతానికి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారిలో సంగమేశ్వర ఆలయం కూడా ఉంటుంది.
కుమ్రంభీం పోరుగడ్డ జోడేఘాట్ పరిసర గ్రామమైన బాబేఝరి సమీపంలో ఎత్తెన గుట్ట మీద నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జోడేఘాట్కు వెళ్లే రోడ్డు పక్కనే బాబేఝరి జలపాతం ఉంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి వచ్చే ప్రజలు ఆదిలాబాద్ రూట్లో వచ్చి హట్టి గ్రామం మీదుగా జోడేగాట్కు పోవచ్చు. ఆదిలాబాద్ వైపు నుంచి వచ్చే ప్రజలు ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి జైనూర్, కెరమెరి మండల కేంద్రం నుంచి హట్టి మీదుగా వెళ్తే 21 కిలోమీటర్ల దూరంగా జోడేఘాట్ వస్తుంది. మధ్యలో బాబేఘరి జలపాతాన్ని చూసి, జోడేఘాట్లోని గిరిజన మ్యూజియం, ప్రకృతి అందాలను చూడొచ్చు.
లింగాపూర్ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్ గ్రామాల మధ్య మిట్టె జలపాతం ఉంటుంది. జైనూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాపూర్కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలి. అలాగే పెంచికల్పేట మండల కేంద్రం నుంచి అగర్గూడ మీదుగా వెళ్తే గుండేపల్లికి పది కిలోమీటర్ల దూరంలో దొద్దులాయి జలపాతం, పెంచికల్పేట రేంజ్లోని అగరుగూడ అడవిలో రెండు కిలోమీటర్లు నడిస్తే కొండెంగ లొద్ది జలపాతం ఉంటుంది.
కాగజ్నగర్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. కాగజ్నగర్ రేంజ్ పరిధిలోని దరిగాం అడవిలో ఉన్న వాటర్ ఫాల్ను చేరుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ట్రెక్కింగ్ మీద అవగాహన, అడవుల్లో నడిచే అనుభవం ఉన్న వారికి ఇది చూడడం కొత్త అనుభూతి ఇస్తుంది.