
బెంగళూరు: ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆహ్లాదకరమైన క్షణం.. విషాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘జీవితంలో ఏదీ మనల్ని హృదయ విదారకానికి సిద్ధం చేయదు. ఆ రోజు నా జట్టుకు అత్యంత సంతోషకరమైన రోజు అయి ఉండాలి.
మన ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత సంతోషకరమైన క్షణం.. విషాదకరంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వాళ్ల కుటుంబాల గురించి నేను ఆలోచిస్తున్నా. వాళ్లకు మంచి జరగాలని ప్రార్థిస్తున్నా. మీకు జరిగిన నష్టం ఇప్పుడు మా కథలో భాగం. ఇక నుంచి మరింత జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతతో ముందుకు సాగుదాం’ అని కోహ్లీ వ్యాఖ్యానించినట్లు ఆర్సీబీ ఎక్స్లో పేర్కొంది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ విజయోత్సవ కార్యక్రమానికి రెండున్నర లక్షల మంది వచ్చారు. ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. సరైన అనుమతులు తీసుకోకపోవడం, ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంపిన ఆహ్వానాలతో జనాలు విపరీతంగా వచ్చారు.
పోలీసులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో జన సమూహాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. అదే టైమ్లో ఆర్సీబీ కేర్స్ అనే ఫౌండేషన్ను కూడా నెలకొల్పింది.