
తిరుమలలో పోలీసులు స్పెషల్ డ్రైవర్ చేపట్టారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని యాచకులు, అనధికార వ్యాపారులను తిరుమల నుంచి తరలిస్తున్నారు. టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి మురళీకృష్ణ , తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ , తిరుమల పోలీసుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి తిరుపతికి పంపించారు. అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు. స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు, తిరుమలలో పని ముగించిన తర్వాత, తమ వద్ద పనిచేసే వారికి తగిన వసతిని తిరుపతిలో కల్పించాలని పోలీసులు సూచించారు.
ఆగస్టులో కూడా ఇలాంటి డ్రైవ్లో 75 మందిని తరలించగా, ఇకపై కూడా నిరంతరం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ అధికారులు పాల్గొన్నారు.