వాంకోవర్: వరల్డ్ కప్లో మాజీ నంబర్వన్ బెల్జియం ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చింది. గ్రూప్–జి చివరి లీగ్ మ్యాచ్లో 5–1తో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి నాకౌట్లోకి ప్రవేశించింది. స్టార్ ప్లేయర్ లియాండ్రో ట్రోసార్డ్ (28, 50వ ని) రెండు గోల్స్ కొట్టగా, కెవిన్ డి బ్రూయిన్ (66వ ని), రొమేలు లుకాకు (86వ ని), అలెక్సిస్ సేల్మేకర్స్ (90+4వ ని) గోల్స్ సాధించారు. ఎలిజా జస్ట్ (84వ ని) కివీస్కు గోల్ అందించాడు. ఈజిప్ట్, ఇరాన్తో జరిగిన మ్యాచ్లను డ్రా చేసుకున్న బెల్జియం ఈ పోరులో మాత్రం ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది.
పెనాల్టీ బాక్స్ నుంచి మెరుపు షాట్లను డైరెక్ట్గా గోల్ పోస్ట్లోకి పంపింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెల్జియం గోల్ కీపర్ తిబాట్ కోర్టోయిస్ అత్యధికంగా 18 వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడిన ఎంజో సిఫో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. మరోవైపు ఇదే గ్రూప్లో ఇరాన్తో మ్యాచ్ను 1–1తో డ్రా చేసుకున్న ఈజిప్ట్ నాకౌట్కు చేరింది.
ఐదో నిమిషంలో మహ్మద్ సలా అందించిన పాస్ను మహ్మద్ సాబెర్ తొలి గోల్ కొట్టి ఈజిప్ట్ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే 14వ నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రామిన్ రెజాయ్యాన్ గోల్ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది.
