
హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమాను తానెప్పుడూ చూడలేదని, హారర్, మిస్టరీ బ్లెండ్ అయిన ‘కిష్కిందపురి’ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందని చెప్పాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా ముచ్చటించాడు.
హీరోగా నేను ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ స్వతహాగా నాకు హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. డైరెక్టర్ కౌశిక్ కలిసినప్పుడు కూడా ఇదే మాట్లాడుకున్నాం. అప్పుడు తను ‘కిష్కింధపురి’ కథ చెప్పాడు. చాలా నచ్చింది. పైగా నా ఫేవరేట్ జానర్. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వొచ్చని స్టార్ట్ చేశాం.
ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడూ చూడలేదు. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా ఉంటుంది. హారర్, మిస్టరీ బ్లెండ్ అయిన సినిమా ఇది. కథలోనే యాక్షన్ ఉంది. కామెడీ కూడా ఆర్గానిక్గా కుదిరింది. ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే వింటేజ్ రేడియో స్టేషన్ సెట్ వేశాం. అలాగే రియల్ హాంటెడ్ హౌజ్లో కూడా షూట్ చేశాం.
ఇందులో అనుపమ పెర్ఫార్మెన్స్ కొత్తగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఇక దర్శకుడి విజన్కు తగ్గట్టుగా టెక్నికల్గా, గ్రాఫిక్స్ పరంగా కాంప్రమైజ్ కాకుండా సాహు గారు నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. సలార్, యానిమల్, కాంతార సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు.
ఈమధ్య ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, యాక్టర్గా నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే తపన పెరిగింది. ఒక కొత్త తరహా పాత్రలో నటించే క్రమంలో సెట్లో ఉండే ఎనర్జీ వేరేగా ఉంటుంది. ఇటీవల దాన్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా.
‘టైసన్ నాయుడు’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘హైందవ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూర్తి కావల్సి ఉండగా కార్మికుల సమ్మెతో కాస్త ఆలస్యమైంది. ‘కిష్కింధ పురి’తో పాటు ఇవి కూడా డిఫరెంట్ జానర్ సినిమాలు. అలాగే ‘పొలిమేర’ దర్శకుడు అనిల్తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అదొక న్యూ ఏజ్ థ్రిల్లర్.