ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు గురువారం తమ ఇంట్రాడే లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫైనాన్స్, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఇండెక్స్లు మధ్యాహ్నం సెషన్లో కిందకి పడ్డాయి. ఆగస్ట్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్ల ఎక్స్పైరీ కూడా ఉండడంతో మార్కెట్లో వోలటాలిటీ (కదలిక) పెరిగింది. వరసగా రెండు సెషన్ల పాటు లాభపడిన సెన్సెక్స్ గురువారం 311 పాయింట్లు (0.53 శాతం) నష్టపోయి 58,775 వద్ద ముగిసింది. ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ తన ఇంట్రాడే గరిష్టం నుంచి 710 పాయింట్లు పడింది. నిఫ్టీ కూడా గురువారం రోలర్ కోస్టర్ రైడ్ చేసింది. ఈ ఇండెక్స్ 83 పాయింట్లు (0.47 శాతం) తగ్గి 17,522 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కేవలం ఐదు కంపెనీల షేర్లు (మారుతి, ఎస్బీఐ, డా.రెడ్డీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్) మాత్రం లాభాల్లో ముగియగలిగాయి. అదానీ గ్రూప్ టేకోవర్ చేయనుండడంతో ఎన్డీటీవీ షేరు గురువారం సెషన్లో కూడా 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను టచ్ చేసింది. ఈ షేరు రూ.407.60 వద్ద ముగిసింది. ఎన్డీటీవీ షేరు గత ఐదు రోజుల్లో 23 శాతం పెరగగా, గత నెల రోజుల్లో 57 శాతం లాభపడింది.
కొన్ని గ్లోబల్ అంశాల్లో అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ రోజు తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకున్నారని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఇన్ఫ్లేషన్ను కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను మరింతగా పెంచుతామనే సంకేతాలను జాక్సన్ హోల్ సింపోజియంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇస్తాడనే ఆందోళనలు ఎక్కువయ్యాయని చెప్పారు. గత రెండు సెషన్లలో కూడా బెంచ్మార్క్ ఇండెక్స్లు నష్టాల్లో ముగియడానికి దగ్గరగా వచ్చాయని అన్నారు. దీంతో గురువారం మార్కెట్ క్రాష్ అంచనా వేసిందేనని చెప్పారు. పెద్ద కంపెనీల షేర్లు నష్టపోయినా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం 0.2 శాతం వరకు లాభపడ్డాయి. సెక్టార్ల పరంగా చూస్తే, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్లు ఎక్కువగా నష్టపోయాయి. ఫెడ్ పాలసీ మీటింగ్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఆయిల్ మార్కెట్లో అనిశ్చితిని తగ్గించేందుకు ఒపెక్+ ఆయిల్ ప్రొడక్షన్ను తగ్గించొచ్చని సౌదీ అరేబియా ప్రకటించడంతో క్రూడాయిల్ రేటు గురువారం పెరిగింది. దేశ ఈక్విటీ మార్కెట్లు మిగిలిన ఎమెర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే ప్రీమియంలో ట్రేడవుతున్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సపోర్ట్ లభిస్తుండడమే మార్కెట్ను నడిపిస్తోందని నాయర్ పేర్కొన్నారు. ఆగస్టు సిరీస్ నుంచి సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్కు రోల్ అవ్వడం (కొత్త పొజిషన్లు తీసుకోవడం) తక్కువగా జరిగిందని, ఫెడ్ జాక్సన్ హోల్ మీటింగ్ సింపోజియంకు ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఎనలిస్ట్ సిద్ధార్ద ఖేమ్కా అన్నారు. గత కొన్ని సెషన్లను చూస్తే నిఫ్టీ 17,500–17,800 మధ్య కన్సాలిడేట్ అయినట్టు కనిపిస్తోందని అన్నారు. గ్లోబల్ మార్కెట్లు చూస్తే, సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్లోని మెజార్టీ మార్కెట్లు కూడా పాజిటివ్గానే ట్రేడయ్యాయి. మరోవైపు బ్రెంట్క్రూడాయిల్ గురువారం 0.17 శాతం పెరిగి బ్యారెల్కు 101.3 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 7 పైసలు తగ్గి 79.93 వద్ద సెటిలయ్యింది.