విశ్వాస పరీక్షలో ఓడిన ఇజ్రాయెల్‌ ప్రధాని

విశ్వాస పరీక్షలో ఓడిన ఇజ్రాయెల్‌ ప్రధాని
  • 12 ఏళ్లపాటు ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు
  • విశ్వాస పరీక్షలో వ్యతిరేకత
  • నూతన ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్
  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

ఇజ్రాయెల్‌కు 12 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పాలనకు బ్రేక్ పడింది. కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్ ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో జరిగిన విశ్వాసపరీక్షలో నెతన్యాహు ఓడిపోయారు. 120 మంది సభ్యులున్న నెసెట్‌లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటేశారు. దీంతో నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నఫ్తాలీ బెన్నెట్ వచ్చే రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో 8 పార్టీలు ఉన్నాయి. వీటిలో ఓ అరబ్ పార్టీ కూడా ఉంది. కాగా.. ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఓ అరబ్ పార్టీ ప్రభుత్వంలో చేరడం విశేషం. 

ఇజ్రాయెల్ పార్లమెంటులో 120 మంది సభ్యులున్నారు. గత రెండేళ్లలో ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో.. బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని పార్టీ మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని పదవిని ఇరు పార్టీలు పంచుకోవాలని అప్పుడు నిర్ణయించుకున్నారు. 

ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నియమితులైన 49 ఏళ్ల నఫ్తాలీ బెన్నెట్ దేశంలో ప్రముఖ మిలియనీర్‌గా పేరు పొందారు. బెన్నెట్ తల్లిదండ్రులు అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు బెన్నెట్ ఓ టెక్ కంపెనీ ఎంట్రప్రెన్యూర్‌గా పేరు సంపాదించారు. మతపరమైన జాతీయవాదిగా రాజకీయాల్లో తనపై ముద్ర ఉంది. 2013లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన... బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో రక్షణ, విద్య, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

బెంజమిన్ నెతన్యాహు.. పన్నెండేళ్లుగా ఇజ్రామెల్ ప్రధానిగా ఉన్నారు. 1996-99 మధ్య మొదటిసారి ప్రధాని అయిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ప్రధాని పదవి చేపట్టారు. 

ఇజ్రాయెల్ కొత్త ప్రధాని.. నఫ్తాలీ బెన్నెట్‌కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే నఫ్తాలీతో సమావేశమై.. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య బంధానికి వచ్చే ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతోందన్నారు.