ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ను వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించింది. ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) నేతలు, కుటుంబ సభ్యుల అభ్యర్థనలతోపాటు ఆడియాలా జైలు నుంచి వచ్చిన తాజా మెడికల్ రిపోర్టులను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ను 48 గంటల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి, సెప్టెంబర్ 16 వరకు అక్కడే ట్రీట్మెంట్ అందించాలి. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు పర్సనల్ డాక్టర్, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్లతో కూడిన ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, కుటుంబ సభ్యులు వారంవారం ఆయన్ను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. అయితే, మెడికల్ రిపోర్టులను మీడియాకు వెల్లడించవద్దని.. ఈ అంశాన్ని రాజకీయాలకు వాడొద్దని న్యాయవాదులకు, కుటుంబ సభ్యులకు కోర్టు స్పష్టం చేసింది.
