
2022లో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లలో మొత్తం13 మ్యాచ్లు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లుగా అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ రాడార్ ఓ నివేదికలో తెలిపింది. అయితే ఈమ్యాచ్ లు ఇండియా వేదికగా జరగలేదని స్పష్టం చేసింది. స్విట్టర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తన నివేదికలో క్రికెట్ తో పాటుగా ఇతర గేమ్ లలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లుగా తెలిపింది. 92 దేశాల్లో నిర్వహించిన ఈ నివేదికలో 12 క్రీడాంశాలకు సంబంధించిన మ్యాచ్లు ఉన్నాయి. గతేడాది మొత్తంగా వివిధ క్రీడలకు చెందిన 1,212 మ్యాచ్ లపై అనుమానాలున్నాయని తెలిపింది. ఇందులో అత్యధికంగా ఫుట్బాల్ మ్యాచ్ లు 775 ఉండటం గమనార్హం. ఫుట్బాల్ తరువాత బాస్కెట్ బాల్ ఉంది.
ఈ గేమ్ లో 220 మ్యాచ్ లు ఫిక్స్ అయినట్టుగా రాడార్ తెలిపింది. మూడో స్థానంలో ఉన్న టెన్నిస్ ఉన్నట్టుగా వెల్లడించింది. ఇక దేశాల వారిగా చూసుకుంటే అత్యధికంగా యూరప్ ఖండంలో ఏకంగా 630 మ్యాచ్ లు అనుమానాస్పదంగా జరిగాయని తెలిపింది. ఆ తరువాత ఆసియా (240), సౌత్ అమెరికా (225), ఆఫ్రికా (93), నార్త్ అమెరికా (24) లు ఉన్నాయని పేర్కొంది. 2021తో పోలిస్తే గతేడాది మ్యాచ్ ఫిక్సింగ్ లు 34% పెరిగాయని వెల్లడించింది. 2021లో ఈ తరహా మ్యాచ్ లు 905 నమోదైతే.. 2022లో అవి 1212కు చేరుకున్నాయి. మొత్తం బెట్టింగ్ టర్నోవర్ పరంగా ఐపీఎల్ 135 మిలియన్ల టర్నోవర్తో ప్రపంచంలో 4వ అతిపెద్ద పోటీగా ఉంది. మొత్తంమీద 67 బిలియన్ల బెట్టింగ్ టర్నోవర్ అంచనాతో క్రీడల పరంగా క్రికెట్ ఐదవ స్థానంలో ఉంది.