V6 News

చర్ల ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్

చర్ల ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్

భద్రాచలం, వెలుగు :  చర్లలోని ఆస్పత్రిని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డును, ఎమర్జెన్సీ, గైనకాలజీ, పీడియాట్రిక్, లేబర్​ రూం, ల్యాబ్​, ఫార్మసీ తదితర మౌలిక సదుపాయాలను చూశారు. రికార్డులు తనిఖీ చేశారు. గర్భిణులకు, చిన్నారుల వైద్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఆర్ కొత్తగూడెంలోని ముత్యాలమ్మ జాయింట్​ లయబిలిటీ యూనిట్​ను సందర్శించారు. 

మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డు, బర్ఫీ, చాక్లెట్​, టీపొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఇప్ప పువ్వు సేకరణ విధానం, నాణ్యత, నిల్వ విధానాలు, మార్కెటింగ్​ అవకాశాలపై సభ్యులతో చర్చించారు. ఇప్ప చెట్ల లెక్కింపు చేపట్టాలని సూచిస్తూ పండ్లు నేలపై పడకుండా నెమ్మదిగా సేకరించేందుకు అవససరమైన నెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్ప పువ్వుఎండబెట్టేందుకు సోలార్​ డ్రయ్యర్లు అవసరం ఉందని సభ్యులు కోరగా వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్​ వెంట సబ్​ కలెక్టర్​ మృణాల్​శ్రేష్ఠ ఉన్నారు.

బొజ్జిగుప్ప స్కూల్​ను తనిఖీ 

దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప స్కూల్​ను కలెక్టర్ జితేశ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, బోధనా ప్రమాణాలు, విద్యార్థుల నేర్పును ఆయన సమగ్రంగా పరిశీలించారు. కిచెన్​ షెడ్​ను పరిశీలించి, పాఠశాల ప్రాంగణంలో పెంచుతున్న చెట్ల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకుని అభినందించారు.