
- కోటి రూపాయలతో ప్రతిపాదనలు
- మినీథియేటర్.. వాటర్ ఫౌంటైన్
- వెబ్సైట్ద్వారా ప్రమోషన్కు ప్రణాళికలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్మ్యూజియానికి సరికొత్త హంగులు అద్దనున్నారు. కోటి రూపాయలతో ప్రతిపాదనలను తయారు చేశారు. ఇప్పటికే ట్రైబల్ మ్యూజియానికి విశేష స్పందన లభిస్తోంది. పీవో బి.రాహుల్ ఆధ్వర్యంలో మ్యూజియంలో ట్రైబల్హట్స్, చిన్నారులు ఆడుకునేందుకు ఆటలు, బోటింగ్, బాక్స్ బాల్ క్రికెట్, సెల్ఫీ పాయింట్స్, ఆదివాసీల వంటకాలు.. ఇలా రకరకాల ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులంతా మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు .
రాష్ట్ర గవర్నర్ సహా, మినిస్టర్లు, భద్రాచలం వచ్చే వీవీఐపీలంతా మ్యూజియాన్ని తిలకించి అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ,శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంతి ధనసరి సీతక్క ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వర్క్ షాపులో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి దృష్టికి ట్రైబల్ మ్యూజియం గురించి తీసుకెళ్లారు. పీవో కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన కోటి రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించారు. గత నెల 24, 25తేదీల్లో మోటా(మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్) స్పెషల్ ఆఫీసర్ సుభాష్ ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి, గిరిజన వంటకాలను తిని ముగ్ధులయ్యారు. కేంద్రం నుంచి రూ.కోటి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రతిపాదనలను తయారు చేసి ఐటీడీఏ పంపించింది.
మినీథియేటర్.. వెబ్సైట్ ద్వారా ప్రమోషన్స్...
- ట్రైబల్మ్యూజియంలో 18 రకాల అంశాలతో సరికొత్త హంగులు కల్పించాలని ఐటీడీఏ యాక్షన్ రూపొందించింది. అందులో ప్రధానంగా మినీథియేటర్ నిర్మాణం ముఖ్యమైనది. 200 మంది కూర్చునేలా వెదురు కుర్చీలు ఏర్పాటు చేస్తారు. టూరిస్టులను ఆకట్టుకునేలా ట్రైబల్ కల్చర్ ఫెర్ఫార్మెన్స్ లు చేసేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకు రూ.20లక్షలు వెచ్చించనున్నారు.
- రూ.1.50లక్షలతో ఒక వెబ్సైట్ను తయారు చేస్తారు. ఇందులో ట్రైబల్ మ్యూజియానికి సంబంధించిన అన్నీ అంశాలను పొందుపరుస్తారు. ఫొటోలు, ఇక్కడ ఉన్న సదుపాయాలు, రూట్మ్యాప్, ట్రైబల్ కల్చర్, టూరిస్టులను ఆకట్టుకునేలా వీడియోలు అన్నీ అందులో ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టూరిస్టులను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుంది.
- మ్యూజియంలోనే ఆడియో విజువల్స్, ట్రైబల్ లైఫ్స్టైల్, ఫెస్టివల్, కల్చర్ విజువల్స్, డాక్యుమెంటరీలు షూట్ చేసి అందులో ప్రదర్శించేలా రూ.10లక్షలతో హాలు నిర్మించనున్నారు.
- ట్రైబల్ కల్చర్కు సంబంధించిన కళాఖండాలు, వస్తువులు సేకరించేందుకు రూ.లక్ష కేటాయించారు.
- ఆర్ట్స్, పెయింట్స్ తో ఆర్ట్స్ గ్యాలరీని రూ.లక్షతో ఏర్పాటు చేయనున్నారు.
- రూ.1.50లక్షలతో లైబ్రరీని ట్రైబల్ కల్చర్కు సంబంధించిన పుస్తకాలతో నెలకొల్పనున్నారు.
- 12 రూంల్లో 12 ఏసీలను రూ.6లక్షలతో ఏర్పాటు చేస్తారు. రూ.4లక్షలతో ట్రైబల్ మ్యూజియానికి రంగులు వేయనున్నారు.
- గిరిజనులు వాడే నగలను ప్రదర్శించేందుకు షోకేష్లు రూ.6లక్షలతో కొనుగోలు చేస్తారు.
- మ్యూజియం గురించి వివరిస్తూ ఆడియో విజువల్స్ మూడు ప్రాంతాల్లో రూ.6లక్షలతో ఏర్పాటు చేస్తారు.
- డిజిటల్ టచ్ స్క్రీన్లు రెండు రూ.50వేలతో కొనుగోలు చేస్తారు.
- ట్రైబల్ సంస్కృతిని తెలియజేసేలా బొమ్మలను రూ.10లక్షలతో తయారు చేయించి మ్యూజియంలో సందర్శకుల కోసం పెట్టనున్నారు.
- రూ.5లక్షలతో రాత్రి వేళల్లో ఆకర్షించేలా సందర్శకుల కోసం మ్యూజియంకు లైటింగ్ ఏర్పాటు చేస్తారు.
- మట్టి ఇండ్లు, గిరిజన సంప్రదాయ సముదాయాలను రూ.15లక్షలతో కట్టనున్నారు.
- మ్యూజియం ముందు రూ.1.50లక్షలతో వాటర్ ఫౌంటైన్ నిర్మిస్తారు.
- 5 కేవీ ఇన్వర్టర్లు 6 బ్యాటరీల పవర్ బ్యాకప్తో రూ.3లక్షల నిధులతో ఏర్పాటు చేస్తారు.
- మోడ్రన్ గేమ్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం రూ.7.50లక్షలు కేటాయించారు.
- ఇవన్నీ ఏర్పాటు చేస్తే ట్రైబల్ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
అందరూ మెచ్చేలా తీర్చిదిద్దుతున్నాం..
అందరూ మెచ్చేలా ట్రైబల్ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నాం. కోటి రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశాం. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి మ్యూజియాన్ని తిలకిస్తున్నారు. మరింత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం.
బి.రాహుల్, పీవో, ఐటీడీఏ