గుండాల, వెలుగు: అప్పు కింద తాను పండించిన మక్కలను వ్యాపారి తీసుకెళ్లడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన మోకాళ్ల సుగుణయ్య(50) మూడెకరాల పోడు భూమిలో మక్కజొన్న సాగు చేశాడు.
ప్రైవేట్ వ్యాపారస్తుల వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగా రాక ఇబ్బంది పడుతున్న క్రమంలో.. ఓ వ్యాపారి అతను పండించిన మక్కలను ఎత్తుకెళ్లడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు సర్కార్ దవాఖానకు, అక్కడి నుంచి వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
