అటవీ ఉత్పత్తులు, ఫారెస్ట్ టూరిజంపై ఫోకస్.. గిరిజనుల జీవనోపాధి.. అడవుల సంరక్షణకు ప్రాధాన్యత

అటవీ ఉత్పత్తులు, ఫారెస్ట్ టూరిజంపై ఫోకస్.. గిరిజనుల జీవనోపాధి.. అడవుల సంరక్షణకు ప్రాధాన్యత
  • జిల్లాలో ఐదు చోట్ల ట్రెక్కింగ్​కు ఆఫీసర్ల ప్రణాళికలు
  • పక్కాగా విప్ప చెట్ల లెక్కింపు.. విప్పపూల సేకరణకు ప్లాన్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని గిరిజనులకు జీవనోపాధి కల్పించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో పాటు అడవుల సంరక్షణపై జిల్లా ఆఫీసర్లు ఫోకస్​ పెట్టారు. అటవీ ఉత్పత్తులు, ఫారెస్ట్​ టూరిజంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని ఫారెస్టులో ఐదు చోట్ల ట్రెక్కింగ్​కు ఏర్పాటు చేస్తున్నారు. విప్పచెట్లను లెక్కించేందుకు సర్వే నిర్వహించనున్నారు. 

అటవీ ఉత్పత్తులపై ప్రత్యేక ప్రణాళికతో.. 

జిల్లాలో ఉన్న అటవీ ఉత్పత్తులపై కలెక్టర్​ జితేశ్​​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్​ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో అపారంగా లభించే విప్పపువ్వు సేకరణతో పాటు విప్ప చెట్ల రక్షణకు ప్లాన్​ చేస్తున్నారు. విప్ప చెట్లను లెక్కించేందుకు సర్వే చేపట్టాలని కలెక్టర్​ ఆఫీసర్లను ఆదేశించారు. నాణ్యమైన విప్పపువ్వు కిలో రూ. 2వేలు ధర పలుకుతోంది. ఈ క్రమంలో విప్ప చెట్లను రక్షించుకోవడంతో పాటు నాణ్యమైన విప్ప పూల సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్లాన్​ చేస్తున్నారు. 

విప్ప నూనెకు కూడా మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. విప్పపూలు, విప్ప నూనె ఆయుర్వేదంతో పాటు పూజల్లో వాడుతున్నారు. విప్ప పూలతో పాటు తుమ్మ జిగురు, శంకు పుష్పం, కరక్కాయ పొడి, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల సేకరణపై గిరిజనులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్​ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విప్పపూలతో తయారు చేసిన లడ్డూలకు మార్కెట్​లో మంచి డిమాండ్​ లభిస్తోంది. జీసీసీ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్​ చేయనున్నారు. పోడు నరికిన ప్రాంతాల్లో వెదురు చెట్లను పెంచేలా ఆఫీసర్లు రైతులను ప్రోత్సహిస్తున్నారు. మరో వైపు చేపల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు. 

ఐదు చోట్ల ట్రెక్కింగ్... 

జిల్లాలో ఫారెస్టు టూరిజం డెవలప్​ మెంట్​లో భాగంగా  పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు, ఇల్లెందులోని ఊరగుట్ట(కోర గుట్ట), మణుగూరు ప్రాంతంలోని రథం గుట్ట, తుమ్మల చెరువు ప్రాంతాల్లో ట్రెక్కింగ్​కు ప్లాన్​ చేశారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఐదు చోట్ల ట్రెక్కింగ్​ మార్గాలను సూచించాలని ఆఫీసర్లను కలెక్టర్​ఆదేశించారు. అటవీ చట్టాలకు ఇబ్బందులు లేకుండా ఫారెస్టు టూరిజంపై ఆఫీసర్లు ఫోకస్​ పెడుతున్నారు. 

ఆయా శాఖల ఆఫీసర్లతో కలెక్టర్​ మీటింగ్.. 

గిరిజనుల అభివృద్ధి, అడవుల సంరక్షణ, ఫారెస్టు టూరిజంపై కలెక్టరేట్​లో రెండు రోజుల కింద పలు శాఖల ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి పలు సూచనలు చేశారు. కొత్తగా పోడు నరికే వారిపై పీడీ యాక్ట్​ పెట్టాలని, అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. జిల్లాలో గొత్తికోయ గిరిజనుల గుంపులు, జనాభా, సౌకర్యాలపై పూర్తి స్థాయిలో నివేధికలను తయారు చేయాలని ఆదేశించారు. అటవీ సంరక్షణ బిల్డింగ్​లు నిర్మించి వాటి ద్వారా గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జీవనోపాధి కార్యక్రమాలను విస్తృతం చే యాలని సూచించారు.