- ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
- సికింద్రాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపు
- హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్)ను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రజాభవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలసి పార్టీ శ్రేణులతో మాట్లాడారు.
ఓటరు జాబితాలో అన్మ్యాపింగ్ పేర్లు 50 శాతానికి పైగా ఉండడంపై డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీఎల్ఏలతో కలిసి డివిజన్ స్థాయి నేతలు నిరంతరం పర్యవేక్షించాలని, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, స్పెల్లింగ్ తప్పుల వల్ల అసలైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలన్నారు. వాళ్లు ఇంటింటికీ వచ్చే సమయంలో ఓటర్లు అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ. 40వేల కోట్లతో ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మిస్తున్నామని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా వారి ఖాతాల్లోనే వేస్తున్నామని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి, నేతలు కోట నీలిమ, ఫిరోజ్ ఖాన్, సంతోష్ పాల్గొన్నారు.
