పేద క్రైస్తవ మైనారిటీలకు సబ్సిడీ యూనిట్లు

పేద క్రైస్తవ మైనారిటీలకు సబ్సిడీ యూనిట్లు
  • ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద కుట్టు మిషన్లు, ఈ బైక్‌లు, ఈ స్కూటీలు
  • నోటిఫికేషన్ జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ 
  • ఆన్‌లైన్‌లో అప్లైకి 18 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పేద క్రైస్తవులకు ఆర్థిక స్వావలంబన  చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీ సంక్షేమ శాఖ  ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆహ్వానించింది. స్వయం ఉపాధి ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ పథకం కింద వివిధ రకాల యూనిట్లను ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు తమ ఉపాధి లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా కింది యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ సబిత కోరారు. ఈ నెల 18 వరకు అర్హులైన లబ్ధిదారులు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక పోర్టల్ ( ఓఎల్ఎస్ఎంఎస్) వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. 

అందించే సబ్సిడీ యూనిట్లు 

ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం కుట్టు మిషన్లు, ఈ బైక్ లు, ఈ స్కూటీలు, మోటార్ బైక్ యూనిట్లు ఇవ్వనుంది. వీటికి అదనంగా చిన్న కిరణా షాపులు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయనుంది. కుట్టుపనిలో నైపుణ్యం ఉండి ఇంట్లోనే స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు కుట్టు మిషన్లు, పర్యావరణహిత రవాణా కోసం డెలివరీ బాయ్స్, వర్కింగ్ ఉమెన్, చిన్న వ్యాపారులకు ఉపయోగపడేలా ఈ బైక్‌లు, ఈ స్కూటీలను ప్రభుత్వం అందజేయనుంది. మార్కెటింగ్, సేల్స్, స్వయం ఉపాధి రంగాల్లో దూసుకుపోవాలనుకునే యువత కోసం  మోటార్ బైకులు ఇవ్వనుంది. కిరాణా దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, ఫ్యాన్సీ స్టోర్స్ వంటి చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలనుకునే వారి కోసం బిజినెస్ యూనిట్స్‌కు ఆర్థిక సాయం చేయనుంది. 

అర్హతలు, దరఖాస్తు విధానం

దరఖాస్తుదారుల వయస్సు 21 ఏండ్ల నుంచి 55 ఏండ్ల లోపు ఉండాలి. కేవలం పేద క్రైస్తవులు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు. అర్హులైన అభ్యర్థులు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందుబాటులో ఉన్న ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్, కావాల్సిన యూనిట్ ఎంచుకుని, వివరాలన్నీ తప్పులు లేకుండా పూరించాలి. అడిగిన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అనంతరం వచ్చే అక్ నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలని ఎండీ సబిత కోరారు.