
గతకాలపు ఆర్ఓఆర్ చట్టంలో అన్ని పనులకు తహసీల్దార్ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ధరణి పోర్టల్తో అధికారాలు అన్ని కలెక్టరుకు కట్టబెట్టారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కొత్త చట్టంగా వచ్చిన భూ భారతిలో అధికారాలు ఇప్పుడు ఆర్డీవోకు చేరిపోయాయి. కలెక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ ఆన్లైన్లో భద్రపరిచి ఉన్నాయి. ప్రతి దరఖాస్తుపైన చర్య తీసుకోవలసి ఉంటుంది.
తహసీల్దార్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని వాటిని తిరస్కరించడం, లేదా ఆమోదించడం అనేది జరగాలి. అందుకు గల కారణాలను వివరంగా దరఖాస్తుదారుకు తెలియజేయాలి. భూభారతి చట్టంలో ప్రతి పనికి గడువు సూచించడమైంది. ఇప్పటి వరకు నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్టుగా పనులు చేశారు. అందులో 11,630 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,374 పైచిలుకు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చాయి. 2,696 వరకు సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పుడు 28 మండలాలలో పైలెట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. రాబోయే రూల్స్, రెగ్యులేషన్స్ కొన్ని మెమోల ద్వారా మార్పులతో జూన్ రెండవ తారీకు నుంచి పూర్తిస్థాయి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది.
9 లక్షల సాదాబైనామాలు
కలెక్టర్ దగ్గర పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ ఆర్డీవోకు బదిలీ అవుతాయి. పార్ట్ 'బి' లో ఉన్న 18 లక్షల ఎకరాలకుగాను సంబంధిత దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. సమాచారాన్ని దరఖాస్తుదారుకు జవాబుగా ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో తొమ్మిది లక్షల పైచిలుకు సాదా బైనామాలున్నాయి. భూభారతి చట్టంలోని సెక్షన్స్ ఆరు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
సాదా బైనామాల అమలు కొరకు నిర్దేశించబడిందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది లాభం చేకూరుతుంది. వీరిలో కొందరు తెల్ల కాగితానికి బదులుగా ఇరవై రూపాయలు, వంద రూపాయల స్టాంపు కాగితం మీద రాసుకున్నారు. అగ్రిమెంట్ అఫ్ సేల్ అనేది ఇంగ్లీషులో టైప్ చేసి భూస్వాధీనం చేసుకుని
కాస్తులోకి వెళ్లిపోయారు. స్టాంప్ వెండర్ వద్ద అతి పురాతనమైన స్టాంపు పేపర్లు కూడా ఉంటాయి. ఇలా కొనుగోలు చేసిన వాటిలో పాత తేదీలు వేసి రాసుకున్న కాగితాలను సాదాబైనామాగానే పరిగణించవలసిందిగా కోరుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన కొద్ది రోజుల వెసులుబాటులో కొన్ని వేల బోగస్ కాగితాలు సృష్టించబడినాయి. ఒకవేళ అది నిజమైన డాక్యుమెంట్ అని తెలిశాక కొనుగోలు చేసిన వ్యక్తి కనీసం 12 సంవత్సరాలు కాస్తులో ఉండాలని నిబంధన పెట్టారు. 12 సంవత్సరాల నిర్ధారణ ఎలా నిర్ణయిస్తారు, ఎలా ధ్రువీకరిస్తారు. 2014కు ముందు కూడా చేతిరాత పహానీలు లేనందున 12 సంవత్సరాల గడువును గుర్తించడం కష్టమవుతుంది. అన్ని విచారణలు పూర్తి అయినప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో పాత తేదీ ప్రకారంగా రిజిస్ట్రేషన్ డబ్బులు చెల్లించాలా? ఈరోజు విలువ ఆధారంగా చెల్లించమని ప్రభుత్వం అడుగుతుందా అనేది తేలలేదు.
28 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు
సాదాబైనామాల కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది. రెవెన్యూ శాఖ, కేంద్ర కార్యాలయం (సీసీఎల్ఏ) ఇచ్చే నివేదిక ఆధారంగా తుది తీర్పు ఉంటుంది. ప్రస్తుతం 28 మండలాలలో పైలెట్ ప్రాజెక్టు నడుస్తున్న దానిలో పట్టాదారు పేరు, జెండర్, చిరునామా, భూమిరకంలాంటి పొరపాట్లను తహసీల్దార్ సవరించగలుగుతున్నారు. కొనుగోలు చేసిన మ్యుటేషన్ లేదా పట్టాదారు చనిపోతే వారసులకు బదిలీ కావటం జరుగుతుంది.
ఇక ముందు కూడా ఉంటుంది. 18 రాష్ట్రాల భూమి పాలన పద్ధతులను పరిశీలించినట్లు చెబుతున్నారు. నిజానికి అన్ని రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ అనేది ఉందా అనేది స్పష్టత లేదు.అంటే భూమి విస్తీర్ణతతో సంబంధం లేకుండా ప్రతి చిన్న కమతానికి కూడా ఒక నంబర్ ఇస్తామంటున్నారు. అది భూదారుగా మనిషికి ఆధార్ లాగ ప్రతి కమతానికి భూదారు ఉంటుందని అంటున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇది ఒక కొత్త పదం. ఒక సర్వే నెంబరుకు టిపన్ మూలం. భూదార్, (చట్టంలో భూదార్, టెంపరరీ భూదార్ కార్డు) గా విభజించి చెప్పడం జరిగింది. గత కాలపు చట్టంలో 33 మాడ్యుల్స్గా ఉన్నాయి. ప్రస్తుత చట్టంలో ఆరు మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి.
ఒక్కొక్క మాడ్యూల్కు నాలుగైదు సబ్ లైన్స్ కూడా ఉన్నాయి. అప్పటి సాఫ్ట్వేర్ను ఆనాటి సిసిఎల్ఏ, భూ నిష్ణాతులు కలిసి రూపొందించారు. ఇప్పుడు భూ భారతి సాఫ్ట్వేర్ను సీసీఎల్ఏ సిబ్బంది, ఎన్.ఐ.సీ ఐటీ ఇంజనీరింగ్ వారు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూముల బదలాయింపు ఆప్షన్ ఇంకా కలెక్టర్ దగ్గరే ఉంది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ట్రిబ్యునల్ వ్యవస్థ ఉంది. తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కాలానుగుణంగా మార్పులు అవసరమే కానీ మెజారిటీ ప్రజలకు ఉపయోగాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. జూన్ రెండు నుంచి అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టం ఆ దిశగా ప్రయాణం చేస్తుందని ఆశిద్దాం.
–వి. బాలరాజు,తహసీల్దార్(రిటైర్డ్)–