తిరుమలలో వేద పారాయణ నిలిపివేతకు కూటమి సర్కార్ కుట్ర: భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమలలో వేద పారాయణ నిలిపివేతకు కూటమి సర్కార్ కుట్ర: భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమలలో వేద పారాయణ నిలిపివేతకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. శుక్రవారం ( జూన్ 20 ) నిర్వహించిన మీడియా సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యలు చేశారు భూమన. తిరుమల దేవ దేవుని సన్నిధిలో అపచారం జరపడానికి ఒక అధికారి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒక అధికారి వేదం ఎవరికి అర్థం అవుతుంది అంటూ అవహేళన గా మాట్లాడి తరతరాలుగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న వేద పారాయణాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన. 

వేదాలకు బదులు వేంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా అంటూ సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. వేదం పటిస్తూ, పాటిస్తూ వేద పారాయణ దారులు పై వేదం వద్దు అని చెప్పడం దారుణమని అన్నారు. వేదం ఎవరికి అర్థం కాదు వెంకటేశ్వర అంటే చాలు అని చెప్పడం.. సనాతన సంప్రదాయానికి,ధర్మానికి తూట్లు పొడవటమేనని అన్నారు భూమన. వేదాలను తర తరాలుగా చెక్కు చెదరకుండ కాపాడుకుంటూ వస్తున్నామని అన్నారు. 

వేదం ఎవరికి అర్థం అవుతుందని అధికార గర్వంతో మాట్లాడుతున్నారని అన్నారు.తాను రాజకీయం కోసం మాట్లాడటం లేదని సనాతన హిందూ జాతికి తెలియ జేస్తున్నానని అన్నారు.తిరుమలలో ప్రతి ఉత్సవాలకు, సేవలకు నిరంతరం వేదం పటిస్తారని.. వేదాలకు చాలా ప్రాశస్త్యం ఉందని అన్నారు. టిటిడి ఆధ్వర్యంలో 6 వేద పాఠశాలలు నడుపుతున్నారని.. 120 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నారని అన్నారు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుపతిలో వేద విశ్వ విద్యాలయం స్థాపించారని అన్నారు. వేద పారాయణ కోసం జగన్ 700 పోస్ట్ లు కేటాయించారని అన్నారు. శ్రీవారి ఆలయంలో 56 మంది వేద పారాయణ దారులు ఉన్నారని.. వీరిలో 26 మంది రిటైర్ అయ్యి ఖాళీలు ఉన్నాయని అన్నారు.కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని అన్నారు.

స్కంద పురాణంలో వేద ఘోష వినపడాలని స్పష్టంగా ఉందని.. వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్షాళన అని చెప్పిన వాళ్ళు, వేద పారాయణ నిలిపి వేయాలని ఆలోచన చేయటం సీఎం చంద్రబాబు అనుమతి లేకుండా జరిగిందా అని ప్రశ్నించారు భూమన.