
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసి మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకున్నారన్నారు. ఆయనకంటే సీనియర్ అయిన రాజాసింగ్ను కాదని ఈయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.
యూ టాక్స్ వసూలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోనే బీఆర్ఎస్ అమలు చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హరీశ్రావులా తమకు మాటలు రావని, కానీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అధికారం లేకుండా హరీశ్రావు ఉండలేకపోతున్నారని, ఆయనకు నిద్ర కూడా సరిగా పడతలేదన్నారు. అర్థంలేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.