- ఏండ్లుగా లీజు రెంట్లు, ఏడీపీ చార్జీలు కడ్తలే
- జాబితాలో ఐమాక్స్, జలవిహార్ రాక్ గార్డెన్, ఫైస్టార్, త్రీస్టార్ హోటళ్లు
- నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సర్కారు
- బకాయిల మాఫీకి పెద్ద లీడర్ల లాబీయింగ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు జాగల్లో వ్యాపారాలు చేస్తున్న బడా సంస్థలు ఏండ్ల తరబడి బకాయిలు చెల్లించకున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. పైగా ఆ బకాయిలను మాఫీ చేయించేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్ద లీడర్లు లాబీయింగ్ చేస్తున్నారు. ‘‘మాఫీ చేయిస్తం.. మాకేమిస్తరు’’ అంటూ సంస్థలతో బేరాలు ఆడుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే వివిధ సంస్థల నుంచి రూ. 260 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. సర్కారు స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అమ్యూజ్మెంట్ పార్క్లు, మాల్స్, రిక్రియేషన్ సెంటర్లు, హోటళ్లను పలు సంస్థలు నిర్మించాయి. ఉమ్మడి ఏపీలో లీజు ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన సంస్థల్లో కొన్ని.. లీజు కిరాయిలు, ఇతర చార్జీలు చెల్లించడం లేదు.
పీపీపీ కింద ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకున్న సంస్థలు అడిషనల్ డెవలప్మెంట్ ప్రీమియం (ఏడీపీ), లీజ్ రెంటల్స్ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో ఉన్న ప్రసాద్ ఐమాక్స్, ఇదే రోడ్డులోని జలవిహార్లో గల రాక్ గార్డెన్, లోయర్ ట్యాంక్ బండ్లోని మాయాబజార్ స్నో వరల్డ్, ఎక్స్పోటెల్ హోటల్, కావూరి హిల్స్లోని దస్పల్లా త్రీస్టార్ హోటల్, శామీర్పేటలోని థీమ్ పార్క్ గోల్ఫ్ కోర్స్, బషీర్బాగ్లోని అర్బన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, మాదాపూర్లోని గోల్డెన్ జూబ్లీ ఫైవ్ స్టార్ హోటల్స్, శేరిలింగంపల్లిలోని గుట్టల బేగంపేట్లో గల త్రీస్టార్ హోటల్ విత్ హెల్త్ స్పా ప్రాజెక్టులు సర్కారు జాగాల్లో పీపీపీ మోడ్లో నిర్మించినవే. ఇవన్నీ ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నాయి. లీజు బకాయిల వివరాలతో రిపోర్టును ప్రభుత్వానికి టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చింది. రిపోర్టు ప్రకారం.. ఒక్కో సంస్థ కోట్లల్లో బాకీలు కట్టాల్సి ఉంది.
జలవిహార్ రాక్ గార్డెన్: రూ. 6.51 కోట్ల బాకీ
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ రాక్ గార్డెన్ రూ. 6.51 కోట్ల బకాయి ఉన్నట్టు అధికారులు లెక్కగట్టారు. ఇందులో రెంట్గా రూ.1.65 కోట్లు, ఏడీపీ సొమ్ము రూ.4.47 కోట్లు, మిగతాది జీఎస్టీ ఉంది. ఈ బకాయిల లెక్క నిరుడు మార్చి వరకు మాత్రమే. ఇక్కడ హైదరాబాద్ ఎంటర్టైన్మెంట్ అండ్ అమ్యూజ్మెంట్ డెవలపర్స్ సంస్థ 12.50 ఎకరాల స్థలాన్ని 33 ఏండ్లకు లీజుకు తీసుకొని.. 2007 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి ప్రభుత్వం ఈ స్థలాన్ని విడతల వారీగా కేటాయించింది. 2001లో 5.30 ఎకరాలు, 2004లో 4.50 ఎకరాలు, 2006లో మిగిలిన భూమి అప్పగించింది. సంస్థ ప్రాజెక్టు విలువ రూ. 27 కోట్లు.
స్నో వరల్డ్: రూ.15.01 కోట్ల బాకీ
లోయర్ ట్యాంక్ బండ్లో ఓషియర్ పార్క్ మల్టీటెక్ లిమిటెడ్ (స్నో వరల్డ్) రూ. 15.01 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2001లో అప్పటి ప్రభుత్వం 2.02 ఎకరాల స్థలం అప్పగించింది. రూ. 20 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు 2004లో ప్రారంభమైంది. ఈ సంస్థ రెంట్ రూ. 8 కోట్లు, ప్రీమియం ఎమౌంట్ రూ. 5.86 కోట్లు, జీఎస్టీ, ట్యాక్సులుగా మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం బకాయిలు చెల్లించకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకొని, భూమి వేరేవాళ్లకు అలాట్ చేసే అవకాశముంది. అయినా.. సర్కారు దీనిపై చొరవ చూపడం లేదు.
ఎక్స్పోటెల్ హోటల్: రూ. 15.13 కోట్ల బాకీ
లోయర్ ట్యాంక్ బండ్లోని ఎక్స్పోటెల్ హోటల్.. రూ. 15.13 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పో సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్సంస్థకు 1.10 ఎకరాల స్థలాన్ని 2003లో 33 ఏండ్ల లీజుకు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది.
అర్బన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్: రూ.62.77 కోట్ల బాకీ
బషీర్బాగ్లోని పాత గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 5.01 ఎకరాల భూమిని అర్బన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఏర్పాటుకు జీఎస్జీ కన్స్స్ట్రక్షన్స్కు 2006లో 33 ఏండ్లకు అప్పటి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. లీజుకు తీసుకున్న నాటి నుంచి రెంట్, ప్రీమియం కలిపి 72.77 కోట్లు బకాయి పడింది. దీనిపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా.. 10 కోట్లు చెల్లించింది. ఇంకా రూ. 62.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. స్థలాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రభుత్వం టర్మినేషన్ నోటీస్ ఇచ్చింది. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
స్టార్ హోటళ్ల బకాయిలు భారీగానే..
కావూరి హిల్స్లోని దస్పల్లా హోటల్ రూ.1.08 కోట్లు చెల్లించాల్సి ఉంది. శామీర్పేట్లోని గోల్ఫ్ కోర్స్ రూ. 5.58 కోట్లు కట్టాల్సి ఉంది. మాదాపూర్లోని శిల్పాకళా వేదిక దగ్గర ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి గోల్డెన్ జూబ్లీ హోటల్స్ సంస్థతో 4.33 ఎకరాల భూమిని 33 ఏండ్ల లీజుకు ఇచ్చేందుకు 2007లో అగ్రిమెంట్ చేసుకున్నారు. రెండు ప్రఖ్యాత హోటళ్లను ఇక్కడ నిర్వహిస్తున్నారు. రూ. 585 కోట్లతో చేపట్టిన హోటళ్లకు సంబంధించి మెయిన్ అగ్రిమెంట్ లీజు రూ. 71 లక్షలు, అడిషనల్ డెవలప్మెంట్ ప్రీమియం ఎమౌంట్ రూ. 63.45 కోట్లు, అదనంగా తీసుకున్న భూమికి సంబంధించిన లీజు రూ. 11.88 కోట్లు బాకీ ఉంది. ఈ హోటళ్లకు సంబంధించి మొత్తంగా ప్రభుత్వానికి రూ. 76.08 కోట్లు రావాల్సి ఉంది. గుట్టల బేగంపేటలో త్రీస్టార్ హోటల్ - హెల్త్ స్పా నిర్మాణానికి 2009లోనే అగ్రిమెంట్ చేసుకున్నా వాటి పనులు ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించి రూ. 50.35 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
మాఫీ చేయిస్తం.. మాకేమిస్తరు!
ఏండ్ల తరబడి బకాయిలు చెల్లించకున్నా ప్రభుత్వం ఆయా సంస్థలపై కనీస చర్యలు చేపట్టలేదు. అగ్రిమెంట్ రూల్స్ను అతిక్రమిస్తే యాక్షన్ తీసుకునే అవకాశమున్నా పట్టించుకోవడం లేదు. ప్రీమియం మొత్తం, రెంట్ చెల్లించకున్నా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ఆయా సంస్థలకు అండగా నిలవడమే కారణమని తెలుస్తోంది. రెండేండ్ల కింద వచ్చిన కరోనాను సాకుగా చూపించి పాత బకాయిల మాఫీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ‘బాకీలు మాఫీ చేయిస్తాం.. మాకేమిస్తారు’ అని ఆయా సంస్థలతో ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రసాద్ ఐమాక్స్: రూ. 27.45 కోట్ల బాకీ
2001లో ప్రసాద్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ అప్పటి ప్రభుత్వంతో ట్యాంక్బండ్ దిగువన 10,832 గజాల స్థలాన్ని 33 ఏండ్ల లీజు కోసం ఒప్పందం చేసుకుంది. ఈ స్థలంలో రూ. 61 కోట్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తామని, సందర్శకులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని అగ్రిమెంట్ సమయంలో హామీ ఇచ్చింది. లీజు రెంట్ మొదటి ఏడాది రూ. 59.58 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ.1.01 కోట్లకు చేరింది. దీనికి తోడు ప్రతినెలా ప్రభుత్వానికి రూ. 35 లక్షల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 2014 నాటికే ఈ మొత్తం రూ. 6.37 కోట్లు ఉండగా.. ఇప్పుడు జీఎస్టీతో కలిపి రూ. 27.45 కోట్లకు చేరింది. దీనిపై అధికారులు కోర్టుకు వెళ్లగా.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా ఆ సొమ్మును సర్కారు ఇంతవరకు వసూలు చేయలేదు.